రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం
హన్మకొండ: హనుమకొండ అశోక చౌరస్తాలో బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ తీరుకు నిరసనగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండలోని అశోక చౌరస్తాలో బీజేపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు, కార్యకర్తలు దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు దిష్టిబొమ్మను లాకెళ్లేందుకు ప్రయత్నించగా.. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారించినా వినకపోవడంతో అరెస్ట్ చేసి హనుమకొండ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ మాట్లాడుతూ.. ఢిల్లీలోని ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ శ్రేణులు చేసిన వీధి నాటకాలకు, సృష్టించిన అరాచకాలకు దీటైన జవాబు ఇస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాద్, జయంత్లాల్, చాడా స్వాతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


