హన్మకొండ అర్బన్: జిల్లాలో కొనసాగుతున్న సర్వేను గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో భూరికార్డులు, భూ కొలతల శాఖ అధికారులు, సర్వేయర్లతో కలెక్టర్ వివిధ సర్వే పనుల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ, పట్టా భూముల హద్దుల నిర్ధారణ, గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించిన సర్వే, రీ–సర్వే కార్యక్రమాలు, చెరువుల శిఖం (వెట్ల్యాండ్స్) భూముల గుర్తింపు, కొలతలు తదితర అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో భూ రికార్డులు, భూ కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు సారంగపాణి, రాజనర్సయ్యతో పాటు జిల్లాలోని 14 మండలాల సర్వేయర్లు పాల్గొన్నారు.
ఈవీఎంల గోదాం తనిఖీ
హనుమకొండ సుబేదారిలోని రెడ్క్రాస్ భవనం వెనుక ఉన్న ఈవీఎంలు, వీవీ ప్యాట్లు భద్రపర్చిన గోదాంను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ శనివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఆర్డీఓ వెంకటేశ్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, టీపీసీసీ ఆర్యదర్శ ఈవీ శ్రీనివాస్రావు, బీజేపీ నుంచి రావు అమరేందర్రెడ్డి, వైఎస్ఆర్సీపీ నుంచి రజిని ఇతర పార్టీల ప్రతినిధులున్నారు.
ట్రాన్స్జెండర్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ట్రాన్స్జెండర్ల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులకు ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేశారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి విశ్వజ, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఓరుగంటి లైలా, కమ్యూనిటీ సభ్యులు, సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
‘ఎస్ఐఆర్’ను వేగంగా పూర్తి చేయండి
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను బీఎల్ఓలు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో నూతన బీఎల్ఓలతో ఆమె సమావేశం నిర్వహించి సూచనలిచ్చారు. సమావేశంలో నాయబ్ తహసీల్దార్ ఎండీ.సుభాన్, బీఎల్ఓలు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్
చాహత్ బాజ్పాయ్


