వరంగల్ అర్బన్ : ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జీడబ్ల్యూఎంసీ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో పారిశ్రామిక శిక్షణ నిర్వహించారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ శిక్షణలో ప్రతిరోజూ 120 మంది సభ్యులు పాల్గొననున్నారు. మొదటిరోజు శిక్షణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో వ్యాపార అవకాశాలు, వ్యాపారం నిర్వహణలో మెళకువలు, ఉత్పత్తుల మార్కెటింగ్, ఆర్థిక నిర్వహణ, వ్యాపార విస్తరణ వంటి అంశాలపై బల్దియా డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, మెప్మా ప్రతినిధులు అవగాహన కల్పించారు. సభ్యుల సందేహాలను నివృత్తి చేసి అవసరమైన మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఆమోదిత శిక్షణ భాగస్వామ్య సంస్థకు చెందిన నిపుణుడు మోహన్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు సందీప్ కుమార్, శ్రీలత, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ రమేష్, సీఓలు, తదితరులు పాల్గొన్నారు.


