కాశిబుగ్గ: ప్రభుత్వం చేనేత ఉత్పత్తులకు టెండర్ విధానం రద్దు చేసి, టెస్కో ద్వారా కొనుగోలు చేసేవరకు ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని పలువురు వక్తలు అన్నారు. శుక్రవారం వరంగల్ కొత్తవాడలో చేనేత పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏకీకృత టెండర్ విధానం రద్దు చేయాలని చేనేత కార్మికులు ఐదు రోజుల నుంచి మగ్గాలు బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో శనివారం నుంచి గోపాలస్వామి గుడి సెంటర్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద నిరసన దీక్షలు చేస్తామని ప్రకటించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతామని తెలిపారు. ప్రభుత్వం టెండర్ విధానం ఉపసంహరిచుకోకపోతే నేతన్నలకు ఆత్మహత్యలే శరణ్యమని పేర్కొన్నారు. దీనిపై మూడు నెలల నుంచి రాష్ట్రంలోని ఉన్నతాధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. ఇకనైనా ఏకీకృత టెండర్లోంచి చేనేత పరిశ్రమ ద్వారా తయారైన కార్పెట్లు, బెడ్షిట్లు తొలగించి, చేనేత మాతృ సంస్థ అయిన టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆప్కో మాజీ డైరెక్టర్ దేవులపల్లి సత్యనారాణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, టీపీసీసీ చేనేత విభాగం అధ్యక్షుడు చిప్ప వెంకటేశ్వర్లు, భూపాలపల్లి జిల్లా నాయకుడు భీమనాఽథుల సత్యనారాయణ, పలు సంఘాల పర్సన్ ఇన్చార్జులు పంతగాని శ్రీనివాస్, ఝెలగం వెంకటమల్లు, అడిగొప్పుల సంపత్, ఝెలగం చిన్న భద్రయ్య, కొలిపాక మదనయ్య ఎలగం సాంబయ్య పాల్గొన్నారు.
టెండర్ విధానం రద్దు చేసేవరకు
ఉద్యమాలు
కొత్తవాడ చేనేత అవగాహన
సదస్సులో వక్తలు


