కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో భూమి మార్కెట్ విలువలను శుక్రవారం నుంచి పెంచనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంతో గురువారం భూక్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయలకు పోటెత్తారు. వరంగల్ ఆర్ఓ కార్యాలయంలో గురువారం ఉదయం 9.30 నుంచి రాత్రి 7.30 వరకు ప్రత్యేక సమయాన్ని కేటాయించినప్పటికీ సాయంత్రం 6.30 గంటలకు సర్వర్ పని చేయకపోవడంతో నూతన మార్కెట్ విలువలను అనుసంధానం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో గురువారం 172 స్లాట్లకుగాను 130 స్లాట్స్ బుక్ చేసుకున్నారు. కాగా, సాయంత్రం 6.30 నిమిషాల వరకు కేవలం 109 దస్తావేజులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాయి.


