హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్బాజ్పాయ్
వరంగల్ అర్బన్ : నగర పరిధిలోని భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల మంజూరులో నిబంధనలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ పేర్కొన్నారు. భవనాల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీపై బుధవారం హనుమకొండ నిట్ సమీపంతో పాటు కాజీపేట రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన పలు భవనాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భవన యజమానులు సమర్పించిన పత్రాలను పరిశీలించడంతో పాటు, నిర్మాణాలకు సంబంధించిన కొలతలు, సెట్బ్యాక్లు, పార్కింగ్ సౌకర్యాలు, ఇతర సాంకేతిక ప్రమాణాలను స్వయంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు, భవన నిర్మాణ అనుమతి షరతులు, సాంకేతిక ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటించిన వారికే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు. భవన యజమానులు నిర్మాణాల సమయంలో అనుమతులకు అనుగుణంగా పనులు చేపట్టి నగరాభివృద్ధికి సహకరించాలని సూచించారు. సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, టౌన్ ప్లానింగ్ అధికారులు అవినాష్ తదితరులు పాల్గొన్నారు.


