ఖిలా వరంగల్: వరంగల్ జిల్లా రవాణా శాఖ అధికారి (ఆర్టీఓ)గా పి.రంగారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులను బదిలీ చేసిన విషయం విధితమే. ఇందులో భాగంగా పెద్దపల్లి ఆర్టీఓగా విధులు నిర్వర్తిస్తున్న రంగారావు వరంగల్ జిల్లా ఆర్టీఓగా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనచోదకులకు మెరుగైన సేవలందిస్తామని పేర్కొన్నారు. అలాగే ఎంవీఐ జె. శ్రీనివాస్, ఏఓ జి. సుభాషిణీ, సీనియర్ అసిస్టెంట్ సీహెచ్.నవీన్, ఏఎంవీఐలు ఎం.శంకర్, ఎస్.నిహారిక బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్టీఓ రంగారావును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
హన్మకొండ కల్చరల్ : వరంగల్ జోన్ దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్గా డి.కృష్ణప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ధార్మిక భవన్లోని వరంగల్ జోన్ దేవాదాయశాఖ ఉపకమిషనర్ కార్యాలయం ఇన్చార్జ్ డీసీ రామల సునీత నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. వరంగల్ జోన్లోని 19 జిల్లాల్లో ఉన్న దేవాలయాల పర్యవేక్షణ, అర్చక ఉద్యోగుల సమస్యలు, కార్యాలయ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం డీసీగా బాధ్యతలు అప్పగించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ అర్చక ఉద్యోగ జాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, భద్రకాళి దేవాలయ ప్రధానార్చకుడు బండారు శేషగిరిరావు, టక్కరసు సత్యం, తనుగుల రత్నాకర్, సూపరింటెండెంట్లు, వివిధ దేవాలయాల సిబ్బంది పాల్గొన్నారు.


