మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్
కాజీపేట అర్బన్ : మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ను అందజేస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలిపారు. కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని దుర్గాబాయి శిశు మహిళా ప్రాంగణంలో డీఆర్డీఏ, సెర్ఫ్ సంయుక్తంగా రూ. 1.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ నిర్మాణానికి బుధవారం ఎంపీ కడియం కావ్య.. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, డీఆర్డీఏ పీడీ మేన శ్రీనుతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రారంభించే తొలి మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ దేశంలోనే ఆదర్శంగా నిలవాలన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సంఘాలు ఆదాయ వనరుల విస్తరణకు పెట్రోల్ బంక్ దోహదపడుతుందని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. ఈ సందర్భంగా ఐనవోలు ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ మహిళా సభ్యులకు రూ.51 లక్షల ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ మేణ శ్రీను, బీపీసీఎల్ ఎండీ సుధీర్, ఐకేపీ రీజినల్ కోఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ ఎంపీ కడియం కావ్య


