బదిలీల్లో గందరగోళం | - | Sakshi
Sakshi News home page

బదిలీల్లో గందరగోళం

Jun 1 2026 1:20 AM | Updated on Jun 1 2026 1:20 AM

బదిలీల్లో గందరగోళం

హన్మకొండ: వ్యవసాయ శాఖలో బదిలీలపై గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం మేనెల లోపు బదిలీలకు అవకాశం ఇచ్చింది. మండల వ్యవసాయ అధికారులు, సహాయ సంచాలకులు మినహా మిగతా అన్ని క్యాడర్లలో బదిలీల ప్రక్రియ పూర్తి చేసింది. వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకుల బదిలీలపై స్పష్టమైన విధానం లేకుండా గందరగోళానికి గురి చేస్తోంది. వ్యవసాయాధికారులకు ఈ నెల 30 వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే అదేరోజు రాత్రి 8.30 గంటలకు జిల్లా వ్యవసాయాధికారులకు మెమో వచ్చింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయాధికారులు ఈ నెల 31న బదిలీల కౌన్సెలింగ్‌ ఉంటుందని మెసేజ్‌లు పంపారు. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లోని వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు ఆదివారం హనుమకొండలోని ఇంటిగ్రేటెడ్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ గది వద్దకు చేరుకోగానే ఎలాంటి సీనియారిటీ జాబితా, ఖాళీ పోస్టుల వివరాలు విడుదల చేయకుండా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని చెప్పడంతో వ్యతిరేకించారు. ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సమాచారం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు చేరింది. దీంతో వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ గోపి వర్చువల్‌లోకి వచ్చి సీనియారిటీ జాబితా విడుదల చేస్తున్నామని, ప్రతి వ్యవసాయాధికారి 10 చొప్పున ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. ఈ మేరకు వ్యవసాయాధికారులు ఆప్షన్లు ఇచ్చారు.

సీనియారిటీ జాబితా, ఖాళీల వివరాలు లేకుండానే కౌన్సెలింగ్‌

వ్యతిరేకించి నిరసన తెలిపిన వ్యవసాయ అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement