హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు శుక్రవారం అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. విష్ణుప్రియ మెయిన్ రోడ్డు, సోమిడిలోని ఉప్పలయ్య, సామ్యల్ డీటీఆర్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాజీపేట: కాజీపేట 63వ డివిజన్ అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన వృద్ధురాలు అయిల సరోజ (60) మూడు రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో కాజీపేట పోలీస్స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గత సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సరోజన తిరిగి ఇంటికి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త సంపత్ ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ ఆదేశాల మేరకు ఎస్సై తాళ్లపల్లి యాదగిరి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సరోజన వివరాలు తెలిస్తే 87126 83765, 87126 85008 నంబర్లలో సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు.
ఖిలా వరంగల్: బల్దియాకు చెందిన రోడ్డు ఊడ్చే వాహనం వరంగల్ హంటర్ రోడ్డు అవంతి హోటల్ వద్ద బుధవారం అర్ధరాత్రి బోల్తా పడింది. ఈ క్రమంలో డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. బల్దియా అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని బోల్తాపడిన వాహనాన్ని జేసీబీ సహాయంతో సరిచేసి అక్కడి నుంచి పంపించారు.
కాజీపేట: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను కాజీపేట చౌరస్తాలో గురువారం జరుపుకున్నారు. వరంగల్ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు బర్ల యాకుబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుసుమ శ్యాంసుందర్, నార్లగిరి రామలింగం, ఎండి రహీం, మారగోని మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్పంప్ జంక్షన్లో..
నయీంనగర్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హనుమకొండ పెట్రోల్పంప్ జంక్షన్లోని ఆయన విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ నాయకుడు పుట్టా రజనీకాంత్, పార్టీ మాజీ కోశాధికారి జయశంకర్, మనోహర్, శ్యాంసుందర్, ఎండి.రహీం, యాకూబ్, సురేష్, హరి పాల్గొన్నారు.


