కాజీపేట: సర్వమానవ సమైక్యత, సద్భావన, ప్రపంచానికి శాంతి సందేశం అందించిన ఇబ్రహీం ఖలీలుల్లాహ్ తన కుమారుడు ఇస్మాయిల్ను దైవానికి అంకితం చేయడానికి ప్రయత్నించిన పవిత్ర రోజైన బక్రీద్ పర్వదినాన్ని నగరవ్యాప్తంగా ముస్లింలు గురువారం భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు. కాజీపేట పట్టణంలో ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మేకలు, గొర్రెలను బలి ఇచ్చి వాటి మాంసాన్ని పేదలకు పంపిణీ చేశారు. ఈద్గా మైదానానికి ముస్లింలు చేరుకుని సామూహిక ప్రార్థనలు చేశారు. మతపెద్ద ఇమామ్ మహబూబ్ రహమాన్ మాట్లాడుతూ సర్వమానవ సమైక్యత, శాంతికోసం అందరూ కలిసిమెలసి జీవించాలని సూచించారు. ముస్లింలకు ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ శుభాకాంక్షలు తెలిపారు.
హసన్పర్తిలో..
హసన్పర్తి: బక్రీద్ పర్వదినం సందర్భంగా హసన్పర్తి మండలంతో పాటు గోపాలపూర్, గుండ్లసింగారం, పలువేల్పులలోని ఆయా ఈద్గాలు, మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నమాజ్ అనంతరం పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకున్నారు.


