సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కయ్య
హన్మకొండ: ప్రతిపక్షాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని సీపీఎం హనుమకొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.చుక్కయ్య విమర్శించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్పై ఈడీని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తూ దాడులు చేయడాన్ని నిరసిస్తూ పార్టీ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పినరయి విజయన్ నాయకత్వంలో కేరళలో అమలు చేసిన ప్రజాహిత కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. ఆ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేకపోవడంతో రాజకీయ కుట్రలకు కేంద్రం పాల్పడుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బొట్ల చక్రపాణి, నాయకులు సీతారాం, గొడుగు వెంకట్, వాంకుడోతు వీరన్న, కారు ఉపేందర్, వల్లెపు రాజు, ఎం.రమాదేవి, ఎన్టీఆర్, జంపాల రమేష్, సబిత, రాధ, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


