విద్యారణ్యపురి: విద్యార్థుల్లోని సాంస్కృతిక ప్రతిభను వెలికి తీసేందుకు భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్(సీసీఆర్టీ) నిర్వహిస్తున్న కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తుల స్వీకరణకు మరో రెండు రోజులే గడువు ఉంది. జిల్లాలనుంచి దరఖాస్తుల సమర్పించేందుకు ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలోని 10 ఏళ్ల నుంచి 14ఏళ్ల వయస్సు కలిగిన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్నకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
సాంస్కృతిక ప్రతిభ కలిగినవారికి ..
సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, హస్తకళలు సాహిత్యకళలు, సాంస్కృతికరంగాల్లో ప్రతిభ కనపర్చే విద్యార్థులకు కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా స్కాలర్షిప్ అందిస్తుంది. దీనికి ఎంపికై న వారికి ఏడాదికి రూ.3,600 స్కాలర్షిప్తోపాటు శిక్షకుడికి చెల్లించే ఫీజు కూడా అదనంగా అందజేస్తారు. దేశవ్యాప్తంగా ప్రతీ ఏడాది 650 కొత్త స్కాలర్షిప్లు మంజూరు చేస్తున్నారు. ఇందులో సాధారణ విభాగానికి 375, సంప్రదాయ కళాకార కుటుంబాలకు 125, గిరిజన సంస్కృతికి చెందిన విద్యార్థులకు 100, సృజనాత్మక రచన/సాహిత్య కళలకు 30, దివ్యాంగ విద్యార్థులకు 20 స్కాలర్షిప్లు కేటాయించారు.
ఎంపిక కోసం ప్రత్యేక కమిటీ
అర్హులైన విద్యార్థుల ఎంపిక కోసం సీసీఆర్టీ కేంద్రస్థాయిలో ప్రత్యేక ఎంపిక కమిటీ ఏర్పాటు చేస్తుంది. షార్ట్లిస్టు అయిన విద్యార్థులకు ఇంటర్వ్యూలు/పరీక్షల వివరాలు తెలయజేస్తారు. ఈ పరీక్షలు సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు మధ్యలో ప్రాంతీయస్థాయిలో నిర్వహించే అవకాశాలున్నాయి. www.ccrt.india.govt.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 30వ తేదీ చివరి గడువు
సాంస్కృతిక ప్రతిభ గలవారికి అవకాశం


