● మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్
హన్మకొండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికుల వెన్ను విరుస్తున్నాయని మాజీ ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా హనుమకొండ వడ్డేపల్లిలోని ఓ కన్వెన్షన్లో 30 కార్మిక సంఘాలతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ఎన్నిసార్లు విన్నవించినా వారి సమస్యలను అధికారులు పరిష్కరించడం లేదని వాపోయారు. కేంద్రం 29 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తెచ్చి కార్మికుడి వెన్ను విరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని విమర్శించారు. కార్మికుల పక్షాన జూన్ 1న సమావేశం నిర్వహించి సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పోరాడుతామన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ వరంగల్ పశ్చిమ కన్వీనర్ నాయిని రవి, ఆయా కార్మిక సంఘాల నాయకులు రాజారపు రాజు, సిరికొండ భిక్షపతి, కాల్వ సుదర్శన్, బాషబోయిన తిరుపతి, రమా చారి, ఇస్మాయిల్, ఈసంపల్లి సంజీవ, శ్రీధర్ రెడ్డి, జయరాం, సుధాకర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రమ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.


