సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్
హన్మకొండ: దేశ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ జాఫర్ ఇస్లాం అన్నారు. గురువారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందన్నారు. అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతులే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైళ్లను ప్రవేశపెట్టేందుకు హైదరాబాద్ కేంద్రంగా రైల్వేకు బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.5,454 కోట్లు కేటాయించినట్లు, హైదరాబాద్–చైన్నె, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–పుణే మధ్య బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రతిపాదించినట్లు వివరించారు. టెక్స్టైల్, మాన్యుఫాక్చరింగ్, స్టార్టప్ రంగాల్లో కొత్త అవకాశాలు రానున్నాయన్నారు. సమావేశంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షడు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, నాయకులు గురుమూర్తి శివకుమార్, రావు అమరేందర్రెడ్డి, ఎం.తిరుపతి రెడ్డి, కుమారస్వామి, నాను నాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతులే ప్రధాని మోదీ లక్ష్యం
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం


