శరణ్ (తెల్లపులి) ఇక లేదు
తెల్లపులి (ఫైల్)
జూపార్కులో గుండెపోటుతో మృతి
న్యూశాయంపేట: వరంగల్ నగరంలోని కాకతీయ జులాజికల్ పార్కు సందర్శకులకు కనువిందు చేసిన తెల్లపులి (శరణ్, 14 సంవత్సరాలు) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందింది. మగ తెల్లపులిని హైదరాబాద్ నుంచి గతేడాది జూలైలో తీసుకొచ్చి రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేతులమీదుగా ఎన్క్లోజర్ను ప్రారంభించి సందర్శకులు వీక్షించేందుకు వదిలారు. కొద్ది రోజులుగా జూపార్కులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా తెల్లపులి సగటు వయస్సు 15 ఏళ్లు ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. సుమారు 14 ఏళ్లు ఉన్న తెల్లపులి వృద్ధాప్యం వల్ల బీపీ, గుండె సంబంధిత, మూత్రపిండాల సమస్యలతో రెండు నెలలుగా బాధపడుతోందని తెలిపారు. పులికి వైద్య సిబ్బంది నిరంతరం చికిత్స అందించినప్పటికి మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయిందని జూపార్కు ఇన్చార్జ్ ఎఫ్ఆర్ఓ మయూరి తెలిపారు. కాగా, చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ ఆదేశాల మేరకు సీనియర్ వెటర్నరీ వైద్యులు, మామునూరు వెటర్నరీ కళాశాల వైద్యబృందం తెల్లపులికి పోస్టుమార్టం నిర్వహించి జూ పార్కులోనే ఖననం చేసినట్లు చెప్పారు.


