
నేడు మట్టి గణపతి ప్రతిమల పంపిణీ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయ ప్రాంగణంలో మంగళవారం మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ సోమవారం తెలిపారు. 300 మందికి మాత్రమే అందించనున్నట్లు, భక్తులు మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.
కేయూ క్యాంపస్: బిందేశ్వర్ ప్రసాద్ (బీపీ మండల్) ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకోవాలని కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం కోరారు. సోమవారం క్యాంపస్లోని ఆడిటోరియంలో బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ జయంతి నిర్వహించారు. బిపి మండల్ చిత్రపటానికి రిజిస్ట్రార్ రామచంద్రం, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సెల్ డైరెక్టర్ బొడిగ సతీశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేయూ పాలక మండలి సభ్యులు చిర్రరాజు, సోషియాలజీ విభాగాధిపతి డాక్టర్ కె.అయిలయ్య, ప్రొఫెసర్ స్వర్ణలత, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి ఎ.శ్రీనివాసులు, పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి ఎస్.వెంకటయ్య, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ జి.కృష్ణయ్య, బీసీ జేఏసీ చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు, అధ్యాపకులు శ్రీకాంత్, ఫిరోజ్ పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: సీపీఎస్ విధానం ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం (టీజీసీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు లింగమొల్ల దర్శన్గౌడ్ ఆరోపించారు. సోమవారం వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనలో భాగంగా ఆత్మగౌరవ సభ పోస్టర్ను హనుమకొండ కలెక్టరేట్లో ఉద్యోగులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా దర్శన్గౌడ్ మాట్లాడుతూ.. టీజీసీపీఎస్ఈయూ ఆధ్వర్యంలో.. సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరేశం, నర్సింహులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంజిత్, నరేంద్రప్రసాద్, శరత్, ఉద్యోగులు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని మైక్రో బయాలజీ విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్ డాక్టర్ పి.పల్లవి సోమవారం తెలిపారు. ‘మైక్రోబియల్ ఫ్రంట్ టైర్స్ హార్మోసింగ్ జీనోమిక్స్ సింథటిక్ బయాలజీ అండ్ మైక్రోబయోమ్ ఇన్నోవేషన్స్’ అంశంపై ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసదస్సు బ్రోచర్ను ఇటీవల కేయూలో వీసీ ప్రతాప్రెడ్డి, కేడీసీ ప్రిన్సిపాల్ ఆచార్య గుర్రం శ్రీనివాస్ ఆవిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కేడీసీ వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, ఐక్యూ ఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనాఽథ్, బీఓఎస్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు జె.చిన్న, వి.శ్రీనివాస్, డి.వెంకన్న, యుగేందర్ తదితరులు పాల్గొన్నట్లు పల్లవి తెలిపారు.
హన్మకొండ: గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి 16 సర్కిళ్లలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ మెమో జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో అధికారులు తమ పరిధి వినాయక మండపాలను సందర్శించి వాడుకుంటున్న లోడ్ను పరిశీలించి ఏ కేటగిరి కిందికి వస్తుందో వివరాలు పంపాలని ఎన్పీడీసీఎల్ యాజమాన్యం అధికారులను ఆదేశించింది. ఒక కిలోవాట్ వరకు రూ.1,560; ఒక కిలోవాట్ నుంచి 1.5 కిలో వాట్ల వరకు రూ.2,300; 1.5 నుంచి 2 కిలోవాట్ల వరకు 3,020; 2 కిలో వాట్ల లోడ్ పైన ప్రతీ కిలో వాట్కు 3,020తో పాటు అదనంగా రూ.1,560 చొప్పున వివరాలు సేకరించాలని టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం అధికారులకు సూచించింది. ఈ మేరకు అధికారులు ఈనెల 30లోపు మండపాల వారీగా విద్యుత్ వినియోగం వివరాలు సేకరించి పంపనున్నారు.