తెనాలి అర్బన్: ప్రజలు అందజేసిన ప్రతి అర్జీని 21–30 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు కార్యక్రమాన్ని తెనాలి మార్కెట్ ఆవరణ ముందు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెనాలి, కొల్లిపర మండలాలతోపాటు పట్టణంలో మరోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్వర్మ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ ప్రతి సోమవారం పీజేఆర్ఎస్ ఉంటుందన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. తెనాలిలో వాహనాల డ్రైవింగ్ టెస్ట్ నిర్వహణకు స్థలం కేటాయించాలని రవాణాశాఖ అధికారులు వినతిపత్రం ఇచ్చారు. పెన్షన్ల కోసం, జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని, రోడ్లు, కాల్వలు నిర్మించాలని, పారిశుద్ధ్య నిర్వాహణను మెరుగుపరచాలని పలువురు వినతిపత్రాలు అందించారు. ఆర్డీవో శ్రీరమణి మాట్లాడుతూ మొత్తం 67 అర్జీలు వచ్చాయని చెప్పారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కె.పార్థసారథి, జిల్లా వ్యవసాయాధికారి ఎం.పద్మావతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె.విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బి.వి.రంగారావు, గ్రామీణ నీటి పారుదల విభాగం పర్యవేక్షక ఇంజినీర్ కె.కల్యాణ చక్రవర్తి, విద్యుత్శాఖ పర్యవేక్షక ఇంజినీర్ సీహెచ్ రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా తదితర అధికారులు పాల్గొన్నారు.


