ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ
మంగళగిరి టౌన్: గంజాయి రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమని, మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఏపీ ఈగల్–ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రాంచ్ల మధ్య శుక్రవారం మంగళగిరిలోని ఈగల్ ప్రధాన కార్యాలయంలో కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. ఐజీపీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ఏపీ ఈగల్ నాలుగు సూత్రాల వ్యూహంతో పనిచేస్తోందన్నారు. డ్రగ్స్ వినియోగం, సరఫరా లేదా గంజాయి సాగుకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే ఈగల్ టోల్ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సెక్రటరీ, సీఈఓ ఏకే పరిడా మాట్లాడుతూ యువత భాగస్వామ్యంతో డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలను నిరంతర ఉద్యమంగా కొనసాగిస్తామని తెలిపారు. రెడ్క్రాస్ ఏపీ స్టేట్ బ్రాంచ్ చైర్మన్ వై.డి.రామారావు మాట్లాడుతూ ఈగల్ నిఘా బలగాలకు రెడ్క్రాస్ విస్తృత వలంటీర్ నెట్వర్క్ తోడైతే సమాజంలో అద్భుతమైన మార్పు తీసుకురావచ్చన్నారు. కార్యక్రమంలో ఆపరేషన్స్ ఎస్పీ కేఎం మహేశ్వరరాజు, అడ్మినిస్ట్రేషన్ ఎస్పీ జి.స్వరూపరాణి, డీఎస్పీలు టి.త్రినాథ్, కె.సింగయ్య, టి.దుర్గాప్రసాద్, సీఐలు రవీంద్ర, విక్టర్, రుద్ర రమేష్, ఆర్ఐలు రాంబాబు, నారాయణ, శివశంకర్ నాయక్, రెడ్క్రాస్ వైస్ చైర్మన్ పి.ఆర్.సి.రాజు, కోశాధికారి డి.శ్రీహరిరావు, ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.సమరం, స్టేట్ కోఆర్డినేటర్ బీవీఎస్ కుమార్, రెడ్క్రాస్ బ్లడ్ సెంటర్ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


