
కూటమి ఏడాది పాలనంతా మోసం
నగరంపాలెం: ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేమీలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయ ఆవరణలో ఆదివారం సాయంత్రం ‘జగన్ అంటే నమ్మకం– చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకావిష్కరణ నిర్వహించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ 12 నెలల కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాల్లేవని, అభివృద్ధి జాడలేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషలిస్ట్లపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడంతోనే సరిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పీడీఎఫ్ బియ్యాన్ని విపరీతంగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. మట్టి, ఇసుక, గనులను ఇష్టానుసారంగా కూటమి నేతలు దండుకుంటున్నారని ఆరోపించారు.చంద్రబాబు హయాంలో ఇంటింటికీ మద్యం ఏరులై పారుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో బెల్ట్ షాప్లు లెక్కలేనన్ని ఉన్నాయని, స్వయానా టీడీపీ నాయకులే తమ బెల్ట్షాప్లను ప్రకటించుకుంటున్నారని తెలిపారు. బెల్ట్ షాప్లు నిర్వహిస్తే బెల్టు తీస్తామని చంద్రబాబు అంటున్నారని, ఆయన బెల్ట్ తీయరని, బెల్ట్షాప్లు కొనసాగుతున్నాయని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించామని గుర్తు చేశారు. ఏడాది చంద్రబాబు మోసపూరిత పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 16న జగన్ అంటే నమ్మకం– చంద్రబాబు అంటే మోసం పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. పుస్తకావిష్కరణలో పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరిఫాతిమా (గుంటూరు తూర్పు), దొంతిరెడ్డి వేమారెడ్డి (మంగళగిరి), బాలవజ్రబాబు (తాడికొండ), పార్టీ నాయకులు నందేటి రాజేష్, వెంకటప్పారెడ్డి పాల్గొన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు
‘జగన్ అంటే నమ్మకం– చంద్రబాబు
అంటే మోసం’ పుస్తకావిష్కరణ