
నయవంచనలో ఘనుడు చంద్రబాబు
పొన్నూరు: ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విమర్శించారు. పొన్నూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం కూటమి ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసిన మోసాలపై వైఎస్సార్ సీపీ ప్రచురించిన ‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’ పుస్తకాన్ని ఆయన పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ అధికారంలోకి రావాలని నోటికొచ్చిన అబద్ధపు హామీలిచ్చి సీఎం చంద్రబాబు, కూటమి నేతలు ప్రజలను మోసం చేశా రని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాజీ సీఎం వైఎస్. జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన పథకాల కంటే రెండింతలు ఇస్తానని చెప్పి, అందరినీ వంచించిన ప్రజాద్రోహి చంద్రబాబు అని మండిపడ్డారు. కూటమి పాలకులు సాగిస్తున్న అరాచక పాలనపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని హెచ్చరించారు. కూటమి ఆకృత్యాలను ఎండగట్టేలా వైఎస్సార్సీపీ పోరాటాలు ఉంటాయని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలతో కలిసి పని చేస్తానని తెలిపారు. ఇకపై ప్రతి వారంలో రెండు గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతానని చెప్పారు.కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో బూటకపు హామీలతో ప్రజలకు చేసిన మోసాలకు నిరసనగా పొన్నూరులో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి వేలాది మంది జనం తరలివచ్చి ప్రభుత్వంపై వ్యతిరేకతను తెలియజేశారని వివరించారు. ఈ నెల 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి వస్తున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పెదకాకాని మండలం ఆటోనగర్ సమీపంలో శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకే నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొని జననేత వైఎస్. జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలకాలని మురళీకృష్ణ కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ భవనం పద్మలీల, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ రూత్ రాణి, అధికార ప్రతినిధి వెంకట సుబ్బయ్య, నాయకులు అంబటి వెంకటేశ్వరరావు, వట్టిప్రోలు రంగారావు, షేక్ మాము, చింతలపూడి మురళీకృష్ణ, బొనిగల రాజారావు, ఈశ్వరయ్య, సుషోబిత, దేవరకొండ గోపి, మూర్తి రాజు, అంబటి రాఘవయ్య, ఎల్. పిచ్చిరెడ్డి, చేబ్రోలు, పెదకాకాని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు
పట్నంబజారు: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, కూటమి సర్కార్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆమె కార్యాలయంలో సోమవారం ‘జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ సంక్షేమమంటే గుర్తుకు వచ్చేది మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేరు మాత్రమేనని తెలిపారు. వెన్నుపోటు, మోసం అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబు పేరు అన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం, చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్. జగన్మోహన్రెడ్డి చేస్తే, కూటమి సర్కార్ ఏడాది పాలనలో కక్షలు, కార్పణ్యాలు తప్పా ఏ ఒక్కటీ అమలు కాలేదని తెలిపారు. రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో 759 అక్రమ కేసులు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై పెట్టారని ధ్వజమెత్తారు. చివరకు సిగ్గులేకుండా శిలాఫలకాలు, దేశంలోనే అత్యంత అద్భుతమైన విజయవాడలో ఆవిష్కరించిన అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉన్న జగనన్న పేరును తొలగించడం దారుణమని ఖండించారు. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలు తగులబెడుతున్నారని, వీటి వల్ల కూటమి నేతలు పాపం మూటగట్టుకోవడమేనని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నేతలు నందేటి రాజేష్, శేషగిరి పవన్, కీశర సుబ్బారెడ్డి, రాజేష్, జాఫర్, షంషేర్, రామయ్య, ఆదినారాయణరెడ్డి, పార్టీ నేతలు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ
కూటమి ప్రభుత్వం ఏడాది
పాలనలో సంక్షేమం శూన్యం

నయవంచనలో ఘనుడు చంద్రబాబు