
పోలీసు శాఖకు 33 అధునాతన మోటారు సైకిళ్లు కేటాయింపు
పచ్చ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ
నగరంపాలెం: సురక్షితమైన డ్రైవింగ్ ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడుతుందని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన మూడు బుల్లెట్లు, 30 అపాచీ ద్విచక్ర వాహనాలను సోమ వారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జిల్లా ఎస్పీ సతీష్కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఓ బైక్ను కొద్ది దూరం నడిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాల నిర్వహణ కోసం సరికొత్త బైక్లతో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఆధునికమైన సాంకేతికతతో కూడిన సిగ్నలింగ్ వ్యవస్థ ఉందన్నారు. ఈ వాహనాలపై సుశిక్షితులైన పోలీస్ సిబ్బందితో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహణకు ప్రణాళికలు రూపొందించామన్నారు. గుంటూరు నగరం, తుళ్లూరు, తాడేపల్లి, తెనాలి, మంగళగిరి, పొన్నూరు పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. రహదారులపై వచ్చే, పోయే ఇతరుల వాహనాలకు ఇబ్బందులు కలిగించేలా అడ్డదిడ్డమైన డ్రైవింగ్, రేసులను అరికట్టేందుకు పెట్రోలింగ్ చేపడతామని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినా లేదా ట్రాఫిక్ సమస్య తలెత్తిన సత్వరమే పరిష్కరించేందుకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), ట్రాఫిక్ డీఎస్పీ రమేష్, ఎస్బీ సీఐ అళహరి శ్రీనివాస్, ఎస్పీ సీసీ ఆదిశేషు, పశ్చిమ ట్రాఫిక్ పీఎస్ సీఐ సింగయ్య, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ పాల్గొన్నారు.