
జగన్ అంటే నమ్మకం... చంద్రబాబు అంటే మోసం
తాడికొండ: ‘జగన్ అంటే నమ్మకం... చంద్రబాబు అంటే మోసం’ అని మోసమని రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైందని తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు అన్నారు. గుంటూరు మల్లికార్జునపేటలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘జగన్ అంటే నమ్మకం... చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఐదు కోట్ల ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తానని అబద్ధపు హామీలిచ్చిన చంద్రబాబు ఏడాదిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు పాలన ఉందని విమర్శించారు. అధికారంలోకి వచ్చేందుకు వేలాది హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను నిలువునా దగా చేశారని మండిపడ్డారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేస్తున్న పోరాటాల ఫలితంగా నేడు తూతూమంత్రంగా ఒకటి, రెండు పథకాలు అమలు చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కులం, మతం, ప్రాంతం, పార్టీ భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. నేడు కూటమి ప్రభుత్వం ఆడలేక మద్దెల ఓడు అనే చందంగా అర్హులకు కూడా పథకాలు అందించలేక చేతులెత్తేసి ప్రజలను సచివాలయాల చుట్టూ తిప్పుతోందని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని, ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా కేసులు పెట్టి భయపెట్టేలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ఆయనకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూటమి ప్రభుత్వం డిపాజిట్లు లేకుండా గల్లంతవడం ఖాయమని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు ముప్పాళ్ల మనోహర్, మైనేని నాగమల్లేశ్వరరావు, తాళ్లూరి వంశీ, మార్పుల శివరామిరెడ్డి, చేవూరి రామ్మోహనరెడ్డి, కొప్పుల శేషగిరిరావు, చుండు వెంకటరెడ్డి, ఆరేపల్లి జోజి, డీజే శ్రీనివాసరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు