
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసి‘డర్’ చంద్రబాబు
మంగళగిరి: ప్రపంచంలో వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమేనని వైఎస్సార్ సీపీ మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ధ్వజమెత్తారు. నగర పరిధిలోని ఆత్మకూరులో గల పార్టీ కార్యాలయంలో సోమవారం ‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి, హనుమంతరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం తప్పా సంవత్సర కాలంలో ప్రజలకే ఏమి చేసిందని ప్రశ్నించారు. రూ.1,50,000 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ఆ డబ్బులతో ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల్ని ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ మోసం చేసిన చంద్రబాబు కనీసం తల్లికి వందనాన్ని అర్హులైన వారికి అందజేయకుండా నిలువునా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. కార్యక్రమంలో అనుబంధ సంఘాల నాయకులు తాడిబోయిన శివగోపయ్య, బుర్రముక్క వేణుగోపాలస్వామిరెడ్డి, నాలి వెంకట కృష్ణ, ఆకురాతి రాజేష్, ఈదులమూడి డేవిడ్రాజు, మాజీ ఎంపీపీ పచ్చల రత్నకుమారి, సంకె సునీత, వేల్పుల ఎలీషా, మల్లవరపు సుధారాణి, బొక్కా అగస్టీన్, మేడా వెంకటేశ్వరరావు, శ్రీనివాసరాజు, సుబ్బారావు, కృష్ణమూర్తి, ధనుంజయరావు, జంగా నాగిరెడ్డి, శరణ్కుమార్రెడ్డి, ముదిగొండ ప్రకాష్, మల్లికార్జునరెడ్డి, గుంజి షణ్ముఖ, జావిద్ పాల్గొన్నారు.