
మరింత మెరుగ్గా జీఎస్టీ వసూలు
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: జిల్లాలో జీఎస్టీ వసూలు మరింత మెరుగయ్యేలా సంబంధిత శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ఎన్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ సతీష్కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర పన్నుల ఆదాయం పెంపుదలలో భాగంగా గూడ్స్, సర్వీసు రంగాల నుంచి జీఎస్టీ సక్రమంగా వసూలయ్యేలా రాష్ట్ర పన్నుల శాఖకు అధికారులు సహకరించాలన్నారు. మున్సిపల్, పంచాయతీల్లో కాంట్రాక్టర్ల నుంచి మినహాయించిన టీడీఎస్ను పెండింగ్ లేకుండా ప్రతి నెలా 20వ తేదీలోపు జీఎస్టీ శాఖకు కచ్చితంగా జమ చేయాలన్నారు. పన్నులు చెల్లించని వ్యాపారుల నుంచి రికవరీ చేయడానికి బ్యాంకులు అవసరమైన సమాచారాన్ని అందించాలన్నారు. ఇంజినీరింగ్ శాఖలో పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లతోపాటు, మైనింగ్, రవాణా రంగాల్లో వ్యాపారులు పన్ను ఎగవేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిఫాల్టర్లు, టీడీఎస్ రిటర్న్స్, చెల్లింపు డిఫాల్టర్లు, తదుపరి టెండర్లలో ప్రవేశించకుండా ఎటాచ్మెంట్కు ఇంజినీరింగ్ విభాగాల అధికారులు అవసరమైన సహకారాన్ని అందించాలని పేర్కొన్నారు. పన్ను డిఫాల్టర్లకు సంబంధించి ఎటాచ్ చేస్తున్న ఆస్తులు రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్టరు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జీఎస్టీ గుంటూరు–1, 2 జాయింట్ కమిషనర్లు జి.శ్రీలక్ష్మి, బి.గీతామాధురి, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, ఎల్డీఎం మహిపాల్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.