
ఏపీలోనూ నంది అవార్డులను ప్రకటించాలి
నగరంపాలెం: ఏపీలో నంది అవార్డులను ఇప్పటికీ ఎందుకు ప్రకటించడం లేదని మా – ఏపీ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్రాజా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని ఓ అతిథిగృహంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటికే తెలంగాణలో గద్దర్ పేరుతో అవార్డులను అందించారని గుర్తుచేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. ఏపీ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ మౌనం వహించడం బాధాకరమని అన్నారు. 2014 –24 వరకు ఏపీలో నిలిచిన నంది అవార్డులను ప్రకటించకపోవడం, విధి విధానాలు అమల్లో అలసత్వం చూపడం దురదృష్టకరమని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సత్వరమే ఆంధ్రాలో జ్యూరీని నియమించాలని డిమాండ్ చేశారు. చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలందించిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, రామానాయుడు, దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్ల పేర్లతో ప్రత్యేక అవార్డులను అందించాలని సూచించారు. అవార్డుల ఎంపికలో రాజకీయ ప్రమేయం ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదన్నారు. ఈ అంశంపై సీఎం, డెప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రిని స్వయంగా కలిసి అభ్యర్థిస్తామని చెప్పారు. ఎఫ్డీసీ చైర్మన్ పదవిని ఏపీలో నివసించే వారికి కేటాయించాలని ఆయన కోరారు. నటుడు మిలిటరీ ప్రసాద్ పాల్గొన్నారు.
ఎఫ్డీసీ చైర్మన్ పదవి భర్తీ చేయాలి మా – ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్రాజా