
అంత్యక్రియలకూ అగచాట్లే..!
ఆ కాలనీ వాసుల శ్మశానానికి వెళ్లాలంటే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వానొచ్చినా, కాలువొచ్చినా తమవారి అంత్యక్రియలకు వారు పడే అగచాట్లు వర్ణనాతీతం. తమవారు చనిపోయి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో ఉంటే, అంత్యక్రియలు ఎలా నిర్వహించాలా అని కాలనీ అంతా కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి. అదే ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులోని ఆదిఆంధ్రా కాలనీ వాసుల దుస్థితి.
ప్రత్తిపాడు: దశాబ్దాల క్రితం ఏర్పడిన కాలనీలో సుమారు మూడు వందలకుపైగా కుటుంబాలు ఉంటాయి. కాలనీకి సమీపంలో పొలాల అవతల శ్మశాన వాటిక ఉంది. అక్కడకు వెళ్లాలంటే దారిలో పొలాల మధ్యనున్న వాగును పోలిన కాలువ ఉంటుంది. కాలువలో నీళ్లు లేని సమయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాటుతుంటారు. కానీ భారీ వానలు కురిసినా, కాలువలు వదిలినా నీరు నడుములోతు ప్రవహిస్తుంటుంది. ఆ సమయంలో కాలనీలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు మృతదేహాన్ని శ్మశానం వరకు భుజాలపై మోసుకెళుతుంటారు. ఆ సమయంలో కాలనీ వాసులు పడే కష్టాలు మాటలకందనివి. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వారి బంధువుల్లో వృద్ధులు, వికలాంగులు ఉంటే అంత్యక్రియలకు కూడా వెళ్లలేని దుస్థితి ఏర్పడుతుంది. ఇటీవల ఓ వ్యక్తి గ్రామంలో చనిపోయినప్పుడు నీటిలో మృతదేహాన్ని శ్మశాన వాటికకు మోసుకెళ్లేందుకు వారు పడిన అవస్థలు చూస్తే అయ్యో..పాపం అనక మానని పరిస్థితి.
ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా..
కాలనీ వాసులు ఎన్నో ఎళ్లుగా ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మాట ఇచ్చినా.. వారి కష్టాలు మాత్రం తీరడం లేదు. గ్రామస్తులు అనేక సార్లు ప్రజాప్రతినిధులు, మంత్రులు, జిల్లా గ్రీవెన్స్ల్లో ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. ఓ దశలో రెవెన్యూ అధికారులు వచ్చి కాలువపై కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని స్థానిక అధికారులకు ఆదేశాలూ ఇచ్చారు. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఎవ్వరికెన్ని సార్లు మొరపెట్టుకున్నా ఎవరూ తమ సమస్యను పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
కాలువ వస్తే శ్మశాన వాటికకు వెళ్లలేని దుస్థితి గొట్టిపాడు ఆదిఆంధ్రా కాలనీవాసుల అవస్థలు మోకాలి లోతు నీటిలో మృతదేహాలను మోసుకెళ్లాల్సిన దుర్గతి

అంత్యక్రియలకూ అగచాట్లే..!