
ఎదురుచూపూల్ ఎన్నాళ్లు!
గుంటూరు వెస్ట్: సుమారు 200 నుంచి 300 మంది సభ్యులు. నెలకు సుమారు రూ.2 లక్షలు పైనే ఆదాయం. ఎందిరికో ఆరోగ్యాన్ని, ఆటవిడుపును అందించే ఎన్టీఆర్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కునారిల్లుతోంది. 25 మీటర్ల పొడవు, 12.5 మీటర్ల వెడల్పుగల ఈ పూల్ నగరంలోనే అతి పెద్దది. గత ఏడాది డిసెంబర్ 1 నుంచి మూతపడిన ఈ పూల్ను కొన్ని నెలలపాటు గాలికొదిలేశారు. కొత్తగా క్రీడలను ప్రోత్సహిస్తామన్న కూటమి ప్రభుత్వం ఉన్న వాటిని కూడా కాపాడుకోలేకపోతోందనే విమర్శలు సభ్యుల నుంచి వస్తున్నాయి. ఎన్నో సార్లు సభ్యులు, స్థానికులతోపాటు పత్రికల్లో కూడా వార్తలు వచ్చినా జీఎంసీ అధికారుల్లో చలనం లేదు. ఇటీవల మరమ్మతుల పనులను రూ.20 లక్షలతో కాంట్రాక్ట్కు అప్పగించారు. అయితే ఆ నిధులూ అరకొరగా ఉండడంతో మరమ్మతులు సజావుగా సాగడం లేదు. ప్రస్తుతం కొన్ని పనులు జరుగుతున్నా అవి ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు. పూల్ని శుభ్రపరచడానికి కావాల్సిన కనీస పరికరాలు కూడా అందుబాటులో లేవు. కూటమి ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలు ఈ పూల్లో ఆధిపత్యం చలాయించడానికి యత్నించడమే కాని అభివృద్ధి గురించి మాట్లాడరనే విమర్శ ఉంది. సభ్యులు ఒకొక్కరూ ఏడాదికి రూ.1,500 వరకు చెల్లిస్తున్నారు. సమ్మర్లో కేవలం ఒక్క మే నెలలోనే ఒక్కొక్కరికి రూ.2,000 వసూలు చేస్తారు. ఇన్ని నిధులు సమకూరుతున్నా అభివృద్ధి మాత్రం చేయరు.
50 మీటర్ల పూల్ సంగతేంటి
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇదే ఆవరణలో 50 మీటర్ల పూల్కు శంకుస్థాపన చేశారు. దీనికి సుమారు రూ.3 కోట్లు కేటాయించారు. తర్వాత దీని సంగతే మర్చిపోయారు. ఈ పూల్ నిర్మాణం అయితే ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ పోటీలు నిర్వహించవచ్చు.
ఏమి మారింది
గత ప్రభుత్వ హయాంలో ఏమీ అభివృద్ధి చేయలేదన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో నాలుగు నెలల నుంచి పరిస్థితి దారుణంగా ఉంది. ఏం మారింది. మేము సీనియర్ సిటిజన్స్. ఈతతో కొంత ఉపశమనం పొందుతాం. ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. 9 నెలల నుంచి బీఆర్ స్టేడియమూ ఇలానే ఉంది. ఇక్కడ వస్తున్న డబ్బులో కొంత పెట్టడానికి ఇబ్బంది ఏమిటీ. ఇంతటి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని తక్షణం పూల్ని ప్రారంభించాలి.
– పెద్ది రమణారావు, సభ్యుడు.
మా మొర ఎవరూ ఆలకించరు
ప్రస్తుతం పూల్ ఉండే ప్రాంతం సుమారు రెండున్నర ఎకరాలు. సుమారు రూ.500 కోట్లపైనే విలువ చేస్తోంది. ఇంత ఖరీదైన ప్రాంతంలో ఉండే పూల్ని జీఎంసీ అధికారులు గాలికొదిలేశారు. గతంలో ఇక్కడ జాతీయ స్విమ్మర్స్ సాధన చేసేవారు. ఇప్పుడు వారు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. బయట ప్రైవేట్ పూల్స్ నెలకు రూ.3,000–5,000 వసూలు చేస్తున్నాయి. అధికారులు చొరవ చూపాలి. ముఖ్యంగా 50 మీటర్ల పూల్ నిర్మాణానికి దాతలు విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుకు వస్తే అందరికీ మేలు జరుగుతుంది.
– పాటిబండ్ల సుబ్బయ్య, స్విమ్మర్
ఏమిటీ నిర్లక్ష్యం
మాకు పర్మినెంట్ మెంబర్షిప్ ఉంది. ఏడాదికి రూ.1,500 కడుతున్నాం. నేను మాస్టర్స్ విభాగంలో నేషనల్స్లో పాల్గొన్నాను. నాకు నిత్యం సాధన తప్పనిసరి. ఏడాదికి కనీసం 6 నెలలు కూడా పూల్ సరిగ్గా ఓపెన్ చేయట్లేదు. ఎన్నిసార్లని ఫిర్యాదులు చేయాలి. డబ్బులు తీసుకునేటప్పుడు ఆ మాత్రం బాధ్యత జీఎంసీ వారికి ఉండక్కర్లేదా. కనీసం ఎంపీ నిధులతోనైనా దీనిని పూర్తి చేయాలి. సమ్మర్ క్యాంప్ కోసం ౖపైపె మెరుగులు చేస్తారు. మళ్ళీ మామూలే.
– ఎ.స్వర్ణ లలిత, స్విమ్మర్
నాలుగు నెలల నుంచి ఈత కొలను మూత నత్తనడకగా పూల్ మరమ్మతులు సుమారు 200 మంది సభ్యుల ఆగ్రహం నెలకు రూ.2 లక్షలపైగానే ఆదాయం అయినా జీఎంసీ అధికారుల నిర్లక్ష్యం
సమస్యలివీ
పూల్లోని ఫ్లోరింగ్ పూర్తిగా దెబ్బతింది. ఫ్లోరింగ్ మళ్లీ వేయాల్సి ఉంది. పురుషులు, మహిళలకు కంబైన్డ్ బాత్ రూమ్స్ ఉన్నాయి. ఇవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని కొత్తగా నిర్మించాలి. లైటింగ్ చాలా వరకు లేదు. నీటిని ఫిల్టర్ చేసే యతంరం కూడా మరమ్మతులకు గురైంది. కొత్త లైట్లు వేయాల్సి ఉంది. ఇక బేబీ పూల్ మరీ దారుణంగా ఉంది. దీనికి కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదు. ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగాయి.

ఎదురుచూపూల్ ఎన్నాళ్లు!

ఎదురుచూపూల్ ఎన్నాళ్లు!

ఎదురుచూపూల్ ఎన్నాళ్లు!

ఎదురుచూపూల్ ఎన్నాళ్లు!