వెండితెరపై తన సహజ సిద్ధమైన నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న నటి సాయి పల్లవి, తన వ్యక్తిత్వంతోనూ ఎంతోమందికి రోల్ మోడల్గా నిలుస్తోంది. తాను గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ, మహిళలు తమని తాము ఎలా ఉన్నా ప్రేమించుకోవాలని నేర్పిస్తోంది. మన విలువలకు విరుద్ధంగా ఉండేవి ఎంతటి విలువగలవయినా తిరస్కరించాలి అనే సూత్రాన్ని ఆచరించి చూపించారు.
రూ. 2 కోట్ల విలువైన ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ని తిరస్కరించి, రంగు అనేది అందానికి కొలమానం కాదని నిరూపించారు. మేకప్ లేకుండా తెరపై కనిపించి .. నీలా నువ్వు ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందని, ఇతరుల కోసం మారాల్సిన అవసరం లేదని చెప్పకనే చెప్పారు. మొటిమలున్నా, జుట్టు రింగులుగా ఉన్నా.. అది దేవుడిచ్చిన వరమని, సౌందర్య సాధనాలకన్నా చిరునవ్వుతో వెలిగే ముఖమే మిన్న అని చెబుతున్నారు.
అలాగే చదువు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆయుధమని, అది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చాటి చెప్పారు. మనం చేసే పనిపై ఇష్టం ఉంటే విజయం దానంతట అదే వస్తుందని ఆమె అంటారు. విజయాలు, అపజయాలు తాత్కాలికమని, అవి నిన్ను ప్రభావితం చేయనివ్వద్దని సూచిస్తారు. బాల్యంలో స్టేజ్ ఫియర్ ఉన్న సాయిపల్లవి.. భయం ఉన్న చోటే ధైర్యాన్ని వెతుక్కోవాలని తన జీవిత విజయాల ద్వారా నిరూపిస్తారు.
(చదవండి: అత్యంత యవ్వనంగా 60 ఏళ్ల తాత..! అతడి గ్లామర్ రహస్యం ఇదే..)


