బ్రిటిష్‌ పత్రికలో భారతీయత | Kerala Health Minister K K Shailaja On British Magazine | Sakshi
Sakshi News home page

మన శైలజా టీచర్‌

Sep 10 2020 8:48 AM | Updated on Sep 10 2020 8:48 AM

Kerala Health Minister K K Shailaja On British Magazine - Sakshi

సమాజానికి చేసే మంచి పనులు ప్రపంచమంతా పర్యటిస్తూనే ఉంటాయి. ఆ మంచితనానికి జేజేలు పలుకుతూనే ఉంటాయి. కేరళ ఆరోగ్య మంత్రి కెకె శైలజను ‘టాప్‌ థింకర్‌ 2020’గా యుకె ప్రతిష్టాత్మక పత్రిక ప్రాస్పెక్ట్‌ ఎంపిక చేసింది. కరోనా కాలంలో ఆమె చేసిన కృషి కారణంగా ఈ అరుదైన గౌరవం లభించింది. బ్రిటిష్‌ మ్యాగజైన్‌ ‘ప్రాస్పెక్ట్‌’ పత్రికలో తత్వవేత్తలు, మేధావులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, రచయితలను ఓటింగ్‌ ఆధారంగా ఎంపిక చేసింది. పాఠకులు, నిపుణులు, సంపాదకుల బృందం అభిప్రాయం ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. న్యూజిలాండ్‌ ప్రధాన మంత్రి జెసిండా అర్డెర్న్‌ ప్రాస్పెక్ట్‌ జాబితాలో 2వ స్థానంలో నిలిచారు. కరోనా కాలంలో రాష్ట్రంలో తగిన చర్యలు తీసుకున్న శైలాజ పేరు 50వ స్థానంలో చేరింది. పత్రిక ప్రకారం ఈ జాబితాను ఖరారు చేయడానికి 20,000 కి పైగా ఓట్లు పోలయ్యాయి. ఈ జాబితాలో కెకె శైలజ మాత్రమే భారతీయ మహిళ. శైలజను ప్రశంసిస్తూ ‘2018 సంవత్సరంలో కూడా కేరళలో వ్యాపించిన నిపా వైరసును శైలజ స్థిరంగా ఎదుర్కొంది‘ అని పత్రిక తెలిపింది. 

టీచర్‌ నుంచి రాజకీయాల్లోకి..
రాజకీయాల్లో చేరడానికి ముందు శైలజ ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. ఏడేళ్లు సైన్స్‌ టీచర్‌గా విధులను నిర్వర్తించిన శైలజ టీచర్‌ 2004 నుంచి పూర్తిగా రాజకీయాల్లో ఉంది. అందరూ ఆమెను అభిమానంగా ఇప్పటికీ ’శైలాజ టీచర్‌’ అనే పిలుస్తుంటారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలోనే కాదు తను ఎంచుకున్న రాజకీయ జీవితాన్ని సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ మంచి పొలిటీషియన్‌ అనే పేరును సంపాదించుకుంటున్నారు. కరోనాను అరికట్టడానికి శైలజ చేసిన ప్రయత్నాలు అన్నింటా ప్రశంసలు అందుకున్నాయి. ప్రతిష్టాత్మక బ్రిటిష్‌ వార్తాపత్రిక ’ది గార్డియన్‌’ కూడా కరోనా కాలంలో శైలాజ చేసిన కృషిని ప్రశంసించింది. కోవిడ్‌–19 మహమ్మారి సమయంలో సరిహద్దులలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను గౌరవించే కార్యక్రమంలో తన ప్రసంగాన్ని వినిపించడానికి ఐక్యరాజ్యసమితి శైలజను ఆహ్వానించింది. 

ప్రాస్పెక్ట్‌ పత్రిక న్యూజిలాండ్‌ ప్రధాన మంత్రి జెసిండా అర్డెర్న్‌ను రెండవ స్థానంలో నిలపడానికి కారణం కరోనా ప్రచారంలో సామాన్య ప్రజలకు ఆమె మద్దతుగా నిలవడం. మహమ్మారిని నిర్మూలించడానికి చేసిన ప్రయత్నాలలో ఆమె కృషి. ఆ తర్వాత ప్రాస్పెక్ట్‌ జాబితాలో ఫ్రెంచ్‌ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి వీనర్‌ ఎస్తేర్‌ డఫ్లో ఉన్నారు. పలుసార్లు బుకర్‌ ప్రైజ్‌ అందుకున్న హిల్లరీ మాంటిల్, పర్యావరణవేత్త డేవిడ్‌ అటెన్‌బరో పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ  ప్రాస్పెక్ట్‌ జాబితాలో పురుషుల కంటే మహిళల పేర్లు ఎక్కువ ఉన్నాయి. ఈ జాబితాలో 26 మంది మహిళల పేర్లు ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement