-
ఫిర్యాదు చేస్తే అంతు చూస్తాం
‘మార్గదర్శి చిట్ఫండ్స్పైనే ఫిర్యాదు చేస్తారా ... మీ సంగతి తేలుస్తాం’ ‘మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితులు.. అని సంఘం పెట్టేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది’ ‘మీ ష్యూరిటీ పత్రాలు మా దగ్గర ఉన్నాయి.. మీ ఆస్తులు వేలం వేయిస్తాం..’ ఇవీ రాజగురివింద రామోజీరావు ఆర్థిక అక్రమాల పుట్ట.. మార్గదర్శి చిట్ఫండ్స్ నుంచి చందాదారులకు కొన్ని నెలలుగా వస్తున్న బెదిరింపులు. నేరుగా చందాదారుల ఇళ్లకే వచ్చి బెదిరిస్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మరికొందరికి రామోజీ ముఠా ఫోన్లు చేసి వేధిస్తోంది. కొందరిని తమ చిట్ఫండ్ కార్యాలయాలకు పిలిపించుకుని మరీ బెదిరిస్తోంది. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. దశాబ్దాల తరబడి ఆయన, ఆయన కోడలు శైలజ వేధింపులు భరించిన చందాదారులు ప్రస్తుతం ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తుండటంతో రామోజీ ముఠా బెదిరింపుల పర్వానికి బరితెగించింది. దీంతో చందాదారుల భద్రతే లక్ష్యంగా ఫిర్యాదులు చేసేందుకు సీఐడీ ప్రత్యేక వాట్సాప్ నంబరును అందుబాటులోకి తెచ్చింది. తాజాగా కొందరు చందాదారులు ‘మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘాన్ని’ ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయించడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ధైర్యంగా బాధితుల ముందడుగు.. మార్గదర్శి చిట్ఫండ్స్ కేసును విచారిస్తున్న సీఐడీ.. బాధితులు ఫిర్యాదు చేసేందుకు 94931 74065తో వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ నంబరుకు ఇప్పటికే వేల సంఖ్యలో చందాదారులు ఫిర్యాదులు చేశారు. తమ అనుమతి లేకుండా చిట్టీలు పాడటం, చిట్ పాడుకున్న నగదు ఇవ్వకుండా రశీదు డిపాజిట్లుగా జమ చేయడం, ష్యూరిటీలు ఇచ్చినా తిరస్కరించి వేధించడం, తమ సంతకాలు ఫోర్జరీ చేయడం వంటి అక్రమాలపై బాధితులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిని సీఐడీ ప్రత్యేక విభాగం నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. వేధింపులకు పాల్పడ్డ పలువురు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లు, ఇతర సిబ్బందిని సీఐడీ విచారిస్తుండటంతో రామోజీ బెంబేలెత్తుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ కార్యాచరణతో చందాదారులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. విజయవాడ కేంద్రంగా మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. బాధితులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రత్యేకంగా 99481 14455 ఫోన్ నంబర్ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో కేవలం మూడు రోజుల్లోనే వందల సంఖ్యలో బాధితులు ఈ సంఘాన్ని సంప్రదించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందరి ఫిర్యాదులను నమోదు చేస్తూ అటు సీఐడీ ద్వారా, ఇటు న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు ఆ సంఘం సన్నద్ధమవుతోంది. బాధితులపై మార్గదర్శి వేధింపుల పర్వం మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు హడలిపోతున్నారు. సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడం, ఏకంగా తన ఇంటికే వచ్చి మరీ విచారించడంతో ఆయన బెంబేలెత్తుతున్నారు. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు బాధితులు కూడా దూకుడు పెంచడంతో ఏక్షణం ఏం జరుగుతుందోనని రామోజీ బేజారెత్తుతున్నారు. దీంతో కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు తన ముఠాలను ఆయన రంగంలోకి దించారు. సీఐడీ అధికారులు, బాధితుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని వారికి ఫోన్లు చేసి రామోజీ ముఠా వేధిస్తోంది. సీఐడీకి ఫిర్యాదు చేసిన చందాదారులను మొదట లక్ష్యంగా చేసుకుంది. సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని వారిని బెదిరిస్తోంది. ఏకంగా మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ ఆఫీసు నుంచే చందాదారులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండటం గమనార్హం. రామోజీ కోడలు శైలజ కిరణ్ పీఏ శశికళ, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు స్వయంగా ఫోన్లు చేసి మరీ బెదిరిస్తుండటం ఆ సంస్థ దిగజారుడుతనానికి నిదర్శనం. మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఫోన్ నంబరుకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ‘అసలు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు.. మీ వెనుక ఎవరు ఉన్నారు.. ఎవరున్నాసరే మిమ్మల్ని కాపాడలేరు.. మీ సంగతి చూస్తాం.. అంతు తేలుస్తాం’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. – సాక్షి, అమరావతి న్యాయపోరాటానికి బాధితులు సిద్ధం.. మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది కాల్మనీ రాకెట్ గూండాల మాదిరిగా చందాదారుల ఇళ్లపై పడుతున్నారు. వారి ఇళ్లకు వెళ్లి మరీ బెదిరిస్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు వ్యక్తులకే తెలియకుండా తాము ఘోస్ట్ చందాదారులుగా నమోదు చేసిన వారి ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేస్తున్నారు. అసలు మార్గదర్శి చిట్ఫండ్స్లో తాము చందాదారులుగా చేరిన విషయమే తమకు తెలియదనివారు ఎంతగా చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ‘సీఐడీ అధికారులు అడిగితే మీరే చందాదారులుగా చేరారని చెప్పండి.. మీకు ఇబ్బందిరాకుండా చూస్తాం.. అంతేగానీ తెలియదని చెబితే మాత్రం మీరు మాకు భారీగా బకాయిలు ఉన్నారని కోర్టులో కేసులు వేస్తాం’ అని హడలెత్తిస్తున్నారు. దాంతో తమకు తెలియకుండానే తమ పేరుతో మార్గదర్శి చిట్ఫండ్స్ సాగిస్తున్న ఆర్థిక అవకతవకలపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక చందాదారుల కోసం ష్యూరిటీ సంతకాలు చేసిన వారి ఇళ్లకు మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది వెళ్లి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ‘మీరు ఇచ్చిన ఖాళీ చెక్కులు మా వద్ద ఉన్నాయి.. వాటిపై భారీ మొత్తం రాసి బ్యాంకులో జమ చేసి బౌన్స్ అయ్యేలా చేస్తాం. తరువాత కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాం’ అని కొందరిని బెదిరించడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరికొందరు చందాదారుల ఇళ్లకు వెళ్లి ‘మీరు భారీగా బకాయి పడ్డారు...అందుకు ప్రతిగా మీ ఇళ్లు, ఆస్తులు వేలం వేయిస్తాం’ అని వేధింపులకు దిగారు. చందాదారుల తరపున మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బందే ఫోర్జరీ సంతకాలు చేసేసి.. తిరిగి చందాదారులపైనే ఫోర్జరీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ పరిణామాలతో మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం ద్వారా అటు సీఐడీని ఆశ్రయించడంతోపాటు మరోవైపు న్యాయపోరాటం చేసేందుకు ఉద్యుక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
లోక్సభ ఎంపీ అభ్యర్థిగా శైలజా టీచర్.. ప్రకటించిన సీపీఎం
తిరువనంతపురం: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వామపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే తమకు పట్టు ఉన్న కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీసీఐ) పార్టీ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే నలుగరు అభ్యర్థుల పేర్లను సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) (సీపీఎం) పార్టీ నేడు (మంగళవారం) 15 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీపీఎం పార్టీ రాష్ట్ర సెక్రటరీ ఎంవీ గోవిందన్ లోక్సభలో పోటీచేసేవారి జాబితాను విడుదల చేశారు. ఎల్డీఎఫ్ మిత్రపక్షమైన సీపీఎం.. మొత్తం 20 లోక్సభ స్థానాల్లో నాలుగు స్థానాలను ఇప్పటికే సీపీఐకి కేటాయించింది. గతంలో రాష్ట్ర ఆరోగ్య శాఖకు మంత్రిగా సేవలందించిన కేకే శైలజా(శైలజా టీచర్)ను సీపీఏం.. లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దించుతోంది. ఆమెకు వడకర లోక్సభ నియోజకవర్గాన్ని కేటాయించింది. థామస్ ఐజాక్ పతనంతిట్ట సెగ్మెంట్ నుంచి పోటీ చేయనున్నారు. మరో సీటును కేరళలోని కాంగ్రెస్(ఎం)కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షపార్టీ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ తిరిగి అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వంలోని కొత్త మంత్రివర్గంలో కేకే శైలజకు మాత్రం చోటు దక్కలేదు. ఆమె రెండోసారి ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రతి ఒక్కరు భావించినప్పటికీ.. పార్టీ ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ఇక.. 2018లో ఆరోగ్య మంత్రిగా చేసిన సమయంలోనూ ప్రాణాంతక నిపా వైరస్ను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలతో కేకే శైలజా అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో సీపీఎం తరఫున పోటీచేసే అభ్యర్థులు వీరే... అలప్పుజ - ఏఎం ఆరిఫ్ అలత్తూరు - కె. రాధాకృష్ణన్ అట్టింగల్ - వి. జాయ్ చాలకుడి - ప్రొఫెసర్ సి. రవీంద్రనాథ్ ఎర్నాకులం - కె.జె. షైన్ ఇడుక్కి - జాయిస్ జార్జ్ కన్నూర్ - ఎం.వీ జయరాజన్ కాసరగోడ్ - ఎం.వీ బాలకృష్ణన్ కొల్లాం - ఎం. ముఖేష్ కోజికోడ్ - ఎలమరం కరీం మలప్పురం - వి. వసీఫ్ పాలక్కాడ్ - ఎ. విజయరాఘవన్ పతనంతిట్ట - థామస్ ఐజాక్ పొన్నాని - కే.ఎస్. హంస వడకర - కె.కె.శైలజ ఇది కూడా చదవండి: కేరళ: నలుగురు అభ్యర్థులను ప్రకటించిన సీపీఐ -
సంతకాలు చేస్తారా.. చస్తారా?
సాక్షి, అమరావతి: ఆదరించినవారికి ద్రోహ చేయడం, ఆశ్రయం కల్పించిన వారిని ముంచేయడం అంటే ఠక్కున చంద్రబాబే గుర్తుకు వస్తారు. కానీ ఆయన రాజగురువు రామోజీరావు కూడా ఆ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. రామోజీ వ్యాపార సామ్రాజ్యానికి నల్లధనం సరఫరా యూనిట్గా నిలుస్తున్న మార్గదర్శి చిట్ఫండ్సే నమ్మక ద్రోహం, మోసాల పునాదుల మీద ఏర్పడింది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్ఫండ్స్ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. రామోజీ చేసిన ద్రోహంపై జీజే రెడ్డి వారసులు సీఐడీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది. పాయింట్ బ్లాంక్లో తుపాకి గురిపెట్టి రామోజీ చేసిన మైండ్ బ్లోయింగ్ దుర్మార్గం ఇదిగో ఇలా ఉంది.. ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ.. కృష్ణాజిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అదే జిల్లా పెదపారుపూడికి చెందిన రామోజీరావు అప్పట్లో నిరుద్యోగి. 1960లో కమ్యూనిస్ట్ పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సు చేయడంతో రామోజీకి జీజే రెడ్డి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. అంతేకాదు.. రెండేళ్లకే అంటే 1962లో మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయడం కోసం రామోజీరావుకు జీజే రెడ్డి ఆర్థిక సహకారం అందించారు. ఆ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. తదనంతర పరిణామాల్లో జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. కాగా జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని చాలాసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. ఆ షేర్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. తుపాకీతో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించిన తరువాత... 2016 సెప్టెంబరు 29న రామోజీరావు ఆ సోదరులిద్దరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007–08 వార్షిక సంవత్సరానికి సంబంధించి షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని యూరీ రెడ్డి కోరారు. అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోమని చెప్పి వెళ్లారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి ఓ రూ.100 విలువైన స్టాంపు పేపర్పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5 వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. కానీ, దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తుపాకీ తీసి అన్నదమ్ములు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిల తలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. దాంతో ప్రాణభయంతో ఆ ఫామ్పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తోందని గానీ, తేదీ గానీ ఆ ఫామ్పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్పై సంతకాలు చేసి అక్కడి నుంచి బయటపడ్డారు. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్పై సంతకం చేసినప్పటికీ తమ వాటా షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. అందుకే వారు రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు. ఆ చెక్కును నగదుగా మారిస్తే షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. అందుకు సంబంధించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. చిట్ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన అన్ని పత్రాలపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ అక్రమాల్లో ఆరితేరిన రామోజీ మాత్రం ఫోర్జరీ సంతకాలతో జీజే రెడ్డి షేర్లను తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని యూరి రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని విస్తుపోయారు. ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. షేర్ల బదిలీకి కంపెనీల చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కథ నడిపించేశారు. రామోజీ, శైలజలపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహా రాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీ రావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. -
కబడ్డీ.. కబడ్డీ... గెలిచింది
40 ఏళ్ల క్రితం సమాజం ఛీత్కారాల మధ్య కబడ్డీ ఆటను ఎంచుకుంది. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. వివక్షలను ఎదుర్కొంది. అవార్డులను గెలుచుకుంది. వందలాది అమ్మాయిలను చాంపియన్లుగా మలిచి అంతర్జాతీయ కబడ్డీ కోచ్గా పేరొందింది మహారాష్ట్రలోని నాసిక్ వాసి శైలజా జైన్. ఆటుపోట్ల మధ్య ౖధైర్యంగా ఎంచుకున్న మార్గం గురించి ఎన్నో విషయాలను పంచుకుంటుంది. ‘‘నా చిన్నతనం అంతా నాగపూర్లో గడిచింది. అమ్మ టీచర్, నాన్న బ్యాంకు ఆఫీసర్. అమ్మకు క్రీడలంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లోనే చీర కట్టుకుని కబడ్డీ ఆడేది. నేను కూడా ఆమె నుండి ఈ గుణాన్ని వారసత్వంగా పొందాను. అమ్మనాన్నలకు నాతో కలిపి నలుగురం ఆడపిల్లలం సంతానం. కానీ, నేనే క్రీడాకారిణి అయ్యాను. స్కూల్లో జరిగే క్రికెట్, ఫుట్బాల్, ఖోఖో, కబడ్డీ.. ప్రతి పోటీలో పాల్గొనేదానిని. ఒక నెల రోజులు ఇంటికి దూరంగా క్రికెట్ క్యాంపులో చేరడానికి వెళ్లాను. ఈ రోజుల్లో ఎలాంటి అడ్డంకులు లేవు కానీ, యాభై ఏళ్ల క్రితం అంటే ఆడపిల్లలు ఆడుకోవడం అంత సులువు కాదు. హాఫ్ ప్యాంట్ ‘అమ్మాయి ఎదిగింది. హాఫ్ ప్యాంట్ వేసుకొని మగపిల్లల్లా ఆడుకోవడానికి బయటకు వెళుతోంది చూడు’ అని స్థానికులు చెప్పుకునేవారు. కానీ, మా అమ్మనాన్నలు ఎప్పుడూ అలాంటి మాటలు పట్టించుకోలేదు. నాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాదు, సపోర్ట్గా నిలిచారు. కబడ్డీ క్లబ్లో చేరడంతో నా జీవితమే మారిపోయింది. మొదటి మార్పు నాగపూర్లోనే మరాఠా లాన్సర్స్ పేరుతో కబడ్డీ క్లబ్ ఉండేది. అక్కడి కోచ్ నా స్నేహితుల్లో ఒకరిని ప్రాక్టీస్కు పిలిచారు. నన్ను పిలవలేదు. ఆ రోజు చాలా ఏడ్చాను. నాకు అవకాశం రాదనుకున్నాను. కానీ నేరుగా క్లబ్కి వెళ్లి, కోచ్తో నాకూ ఆడాలని ఉందని చెప్పాను. వారి అనుమతితో క్లబ్లో చేరిపోయాను. అటు నుంచి మిగతా క్రీడలను వదిలేసి కబడ్డీపైనే దృష్టి పెట్టాను. గ్రౌండ్కు చేరుకోవడంలో నేనే ముందుండేదానిని. వేరే వాళ్లు రాకముందే గ్రౌండ్ ఊడ్చటం, నీళ్లు చల్లడం, మార్కింగ్ చేయడం మొదలైన పనులన్నీ చేసేదాన్ని. చీకటి దారుల గుండా.. ఇంటికి గ్రౌండ్కి మధ్య 12 కి.మీ దూరం. అందుకే ఇంట్లో సైకిల్ కావాలని పట్టుబట్టాను. సైకిల్పై కాలేజీకి, ప్రాక్టీస్ కోసం క్లబ్కు వెళ్లేదాన్ని. దీని కోసం నాగ్పూర్లోని సివిల్ లైన్ ఏరియాను దాటాల్సి వచ్చేది. సాయంత్రం 5 గంటల నుంచే సివిల్ లైన్స్ మొత్తం నిర్మానుష్యంగా మారేవి. కానీ, నేను 8 గంటలకు చీకట్లో అదే మార్గంలో సైకిల్పై ఇంటికి వచ్చేదాన్ని. ఎప్పుడూ భయం అనిపించలేదు. ఎవరైనా వేధించినప్పుడు నడిరోడ్డుపై కొట్టి గుణపాఠం చెప్పేదాన్ని. చిన్న చిన్న అవార్డులైనా... యూనివర్శిటీ, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాను. చిన్న చిన్న అవార్డులు వచ్చినా గర్వంగా ఫీలయ్యేదాన్ని. నాకు నేనే అత్యుత్తమ ప్లేయర్ననే విశ్వాసం పెరుగుతుండేది. పెళ్లయ్యే వరకు అదే మైదానంలో రోజూ ప్రాక్టీస్ చేసేదాన్ని. పెళ్లి తర్వాత నాసిక్కు వచ్చాను. అప్పటికే చదువు పూర్తయింది కాబట్టి ఉద్యోగం వేటలో ఉన్నాను. ఆ సమయంలో రాష్ట్ర కోచ్ని కలిశాను. కోచ్ అవడానికి ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్’ నుంచి కోర్సు చేయాలని సలహా ఇచ్చారు. బెంగళూరు వెళ్లి కోర్సు పూర్తి చేశాను. అక్కడి నుంచి తిరిగొచ్చాక క్రీడా విభాగంలో కోచ్ ఉద్యోగం వచ్చింది. పాఠశాల స్థాయి నుంచి... కబడ్డీ, ఖోఖో ఆటలకు నేనే కోచ్ని. పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులను సిద్ధం చేయడం ప్రారంభించాను. నా శిక్షణలో అమ్మాయిలు అవార్డులు గెలుచుకోవడం చూసి నాలో ధైర్యం కూడా పెరుగుతూ వచ్చింది. శిక్షణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అందుకు మా అత్తింటివారు ఎలాంటి అడ్డు చెప్పలేదు. స్పోర్ట్స్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చినప్పుడు ఆరు నెలల్లోనే దానిని తిరిగి ఇచ్చేశాను. ప్రమోషన్ తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోతారని చెప్పారు. కానీ, ప్రమోషన్ పేరుతో ఆఫీసులో కూర్చొని ఉండటం నా వల్ల అయ్యే పని కాదు. గ్రౌండ్లోనే నా భవిష్యత్తు ఉందని బలంగా నమ్మేదాన్ని. అందుకే, తక్కువ డబ్బు వచ్చినా గ్రౌండ్ను వదలలేదు. డిప్రెషన్ను అధిగమించి.. నా దగ్గర శిక్షణ తీసుకున్న 400 మంది అమ్మాయిలకు జాతీయ స్థాయిలో ఆడే అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నాను. రికార్డ్ ఉన్నప్పుటికీ టీమ్ ఇండియా టీ షర్ట్ ధరించే అవకాశం రాలేదు. అంతర్జాతీయ మ్యాచ్లకు ఎంపికైనా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అడుగడుగునా అవరోధాలు. దీంతో డిప్రెషన్కు గురయ్యాను. కొన్నాళ్లు ఏం చేయాలో అర్థం కాని స్థితి. 2008లో జూనియర్ ఆసియా చాంపియన్షిప్లో కోచ్గా అవకాశం వచ్చింది. ఫలితాలు బాగుండటంతో ఆ తర్వాత అంతర్జాతీయ జట్టుకు కోచ్గా వెళ్తానని అందరికీ చెప్పాను. నా కల నెరవేరుతుందని అనుకున్నాను. కానీ, నా ఆశలు మళ్లీ నేలకు జారాయి. అదే ఏడాది మళ్లీ ప్రమోషన్ వచ్చింది. 2014 వరకు అదే జాబ్లో కొనసాగి రిటైరయ్యాను. అసంతృప్తి అలాగే ఉండిపోయింది. అంతర్జాతీయంగా అవకాశాలు... రిటైరయ్యాక ఇరాన్ నుండి బాలికల జట్టుకు కోచ్గా ఉండమని ఆహ్వానం అందింది. మా ఇంట్లోవాళ్లు ఆ దేశంలో ఉండటం సులభం కాదన్నారు. ఒకసారి పాస్పోర్ట్పై ఇరాన్ ముద్ర పడితే ఇక అంతే అన్నారు. కానీ, అవేవీ పట్టించుకోకుండా వెళ్లాను. అలా మొదలైన నా ప్రయాణం రెండేళ్లకు జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల వరకు వెళ్లింది. అక్కడి అలవాట్లు, తిండి, భాష, వేషధారణ అన్నీ మనకు భిన్నమైనవే. అయినా లభించిన అవకాశాన్ని బంగారంగా మార్చుకునే ధైర్యాన్ని పెంచుకున్నాను. నేను జైన్ కమ్యూనిటీకి చెందినదానిని, మాంసాహారం తినలేను. ఇరాన్లో శాకాహారం దొరకడం చాలా కష్టం. కోచ్గా ఉంటూ నాన్వెజ్ తినకుండా ఉండటం ఎలా సాధ్యం అని అక్కడివాళ్లు ఆశ్చర్యపోయేవారు. భారతదేశానికి వచ్చినప్పుడు నా ఆహారానికి కావల్సిన పదార్థాలను తీసుకెళ్లేదాన్ని. కానీ, ఆహారం గురించి పై అధికారులకు ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. రాని భాషలు నేర్చుకున్నాను. టీమ్తో అనుబంధాలను పెంచుకున్నాను. ఏడాదిన్నరలో 14 క్యాంపులు నిర్వహించాను. జకార్తా నుంచి భారత్కు జకార్తా ఆసియా క్రీడల్లో నా జట్టు సెమీఫైనల్స్కు చేరుకొని భారత జట్టుతో ఫైనల్స్కు ఎంపికయ్యింది. ఆ మ్యాచ్లో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. నా దేశానికి ప్రత్యర్ధిగా నేనే ఉన్నాను... దీంతో తిండి, నిద్రకు దూరమయ్యాను. కానీ, నా బాధ్యత గుర్తుకొచ్చింది. నా జట్టు అమ్మాయిలను ప్రోత్సహించాను. నేను చెప్పిన ట్రిక్కులు పాటించి, గెలుపొందారు. స్వర్ణం గెలిచిన తర్వాత అమ్మాయిలు గ్రౌండ్లో ఉత్సాహంగా జెండాతో పరుగులు ప్రారంభించారు. నా చేయి పట్టుకుని ‘మేడమ్ రండీ.. మీ వల్లే మాకు బంగారు పతకం వచ్చింది..’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానీ, వారితో ‘నా కాంట్రాక్ట్ మిమ్మల్ని ఫైనల్ మ్యాచ్ వరకే, అది పూర్తయిపోయింది. నా భారత ఆటగాళ్లు బాధపడుతుంటే, నేను సంబరాలు చేసుకోలేను’ అని చెప్పాను. తొలిసారి భారత్ ఓడిపోయి ఇరాన్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ చరిత్రలో నా పేరు కూడా నమోదయ్యింది. స్వదేశానికి... ‘నా దేశాన్ని గెలిపించుకోవాలే కానీ, పరాయి దేశాన్ని కాదు’ అనే ఆలోచనతో తిరిగి నాసిక్ వచ్చేశాను. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న గిరిజన బాలికలకు కబడ్డీలో శిక్షణ ఇస్తున్నాను. వారిని నా అకాడమీకి తీసుకువచ్చి డైట్ కిట్స్ ఇస్తుంటాను. ఇందుకు వనవాసి కళ్యాణ్ ఆశ్రమం నుంచి సహాయం అందుతుంది. గిరిజన బాలికలు క్రీడల్లో చాలా బాగా రాణిస్తున్నారు. దేశానికి మంచి క్రీడాకారిణులు లభించేలా వారిని తీర్చిదిద్దడంలో ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను’’ అని వివరించారు శైలజా జైన్. -
చెప్పకుండా శైలజ దేశం దాటారు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ది భారీ కుంభకోణమని, ఈ కేసులో వేలాది చందాదారుల ప్రయోజనాలు కాపాడటం తమ బాధ్యత అని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఇంత పెద్ద స్కాంలో నిందితులుగా ఉన్న రామోజీరావు(ఏ–1), శైలజ (ఏ–2) దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడంలేదని తెలిపింది. మూడుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని చెప్పింది. దర్యాప్తు అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, రికార్డులు చూపించడంలేదని తెలిపింది. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శైలజ దేశం దాటి వెళ్లారని, అందుకే ఆమెపై లుక్ అవుట్ నోటీసులు (ఎల్వోసీ) జారీ చేయాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించింది. దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికే అమెరికా పర్యటనను సాకుగా ఎంచుకున్నారని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారని మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ ఎండీ సీహెచ్ శైలజ వేర్వేరుగా దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్ కె.సురేందర్ విచారణ చేపట్టారు. ఈ పిటిషన్లలో ఏపీ సీఐడీ కౌంటర్లు దాఖలు చేసింది. అనంతరం వాదనలకు పిటిషనర్ల తరపు న్యాయవాది రెండు వారాల సమయం కోరడంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. కౌంటర్లో ఏపీ సీఐడీ వెల్లడించిన కీలక వివరాలు.. సొంత ప్రయోజనాల కోసం వేల కోట్లు మళ్లించారు మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లోని 37 బ్రాంచ్ల్లో ఆ సంస్థ రూ.25 వేల నుంచి రూ.కోటి వరకు చిట్లు నడుపుతోంది. వీటిలో చందాదారులు పెద్దఎత్తున పెట్టుబడి పెట్టారు. మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజ, బ్రాంచ్ మేనేజర్లు వసూలు చేసిన వేల కోట్ల రూపాయల్ని అక్రమ మార్గాల్లో సొంత సంస్థల్లోకి, మ్యూచ్వల్ ఫండ్స్లోకి మళ్లిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. చందాదారులకు చెల్లింపుల్లో విఫలమయ్యారు. ఇవన్నీ నేరపూరిత కుట్ర, విశ్వాస ఉల్లంఘన, మోసం కిందికే వస్తాయి. మార్గదర్శి ఎండీ శైలజపై సీఐడీ ఏడు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు కీలక దశలో ఉంది. ఈ కేసులో మరిన్ని వివరాలు, కీలక ఆధారాలు తెలుసుకోవడానికి శైలజ విచారణ ప్రధానం. దర్యాప్తు సంస్థ ముందు హాజరై ఆమె వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఏప్రిల్ 6న విచారణలో ఆమె సహకరించలేదు. అంతేకాదు అధికారులు అడిగిన ఆర్థిక లావాదేవీల రికార్డులు, డాక్యుమెంట్లు తీసుకురాలేదు. ఆమెకు రాజకీయంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో ఉన్న పరిచయాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసు్తన్నారు. దేశం విడిచి పారిపోయే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే చందాదారులకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. వేలాది చందాదారుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు శైలజను అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు అప్పగించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను కోరాల్సివచ్చింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలని ఏప్రిల్ 22న నోటీసులు జారీ చేశాం. కుటుంబ వ్యవహారాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఏప్రిల్ 27 నుంచి మూడు నాలుగు వారాలు హాజరుకాలేనని ఏప్రిల్ 23న సమాధానం ఇచ్చారు. అనంతరం మే 12న, మే 22న రెండు సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె నిరాకరించారు. ఆమె ఇంట్లోనే విచారణ చేపడతామని చెప్పినా అంగీకరించలేదు. అధికారులకు ఇచ్చిన సమాధానంలో ఎక్కడా అమెరికా వెళ్తున్న విషయం చెప్పలేదు. ఆ సమాచారాన్ని ఉద్దేశ్యపూర్వకంగా దాచి ఉంచారు. విచారణలో సహకరించకపోవడం, నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడం, సమాచారం లేకుండా దేశం దాటి వెళ్లడం.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎల్ఓసీ జారీ చేయాల్సి వచ్చింది. శైలజ చర్యలు రిజర్వు బ్యాంకు చట్టాలకు విరుద్ధం. బ్రాంచిలలో సోదాల సందర్భంగా అధికారులు పలు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై శైలజ నుంచి వివరణ తీసుకోవడం అత్యంత కీలకం. ఇంత పెద్ద ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు సాగుతుంటే.. విదేశాలకు వెళ్లడానికి ఆమె చెప్పిన కారణం ఓ సాకు మాత్రమే. ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించలేదు అని సీఐడీ కౌంటర్లో తెలిపింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement