
‘పోలీసు శాఖలో అధికారుల స్థాయి ర్యాంకుల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది’ అంటుంది తాజా ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025
ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం...
⇒ పోలీస్శాఖకు సంబంధించి జాతీయ స్థాయిలో కేవలం 8 శాతం మహిళా అధికారులు మాత్రమే ఉన్నారు. వీరిలో 52 శాతం మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 25 శాతం మంది ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.
⇒ కానిస్టేబుల్ స్థాయిలో మహిళలు 13 శాతం ఉన్నారు.
⇒ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) అధికారులలో కేవలం 12 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు.
⇒ అత్యధికంగా మహిళా డిఎస్పీలతో (133) మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.
⇒ ప్రస్తుతం 78 శాతం పోలిస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్లు ఉన్నాయి.
⇒ ఏ ఒక్క రాష్ట్రం లేదా కేంద్రపాలితప్రాంతం కూడా పోలీసుశాఖలో మహిళల కోసం వారి స్వంత రిజర్వ్ కోటాను చేరుకోలేదు.
ఎందుకు ఇలా?
‘పోలీసు శాఖలో మహిళలప్రాతినిధ్యం తక్కువగా ఉండడానికి దీర్ఘకాలిక, సామాజిక, వ్యవస్థాగత వైకల్యాలే కారణం. పోలీసింగ్ అనేది పురుషులు, శారీరక బలం ఉన్న వారి వృత్తి మాత్రమే, సుదీర్ఘమైన పనిగంటలతో ముడిపడి ఉన్న ఉద్యోగం అనే లోతైన అబిప్రాయం చాలామందిలో ఉంది. కుటుంబం, సామాజిక ఆకాంక్షలు మహిళలు పోలీసు వృత్తిలోకి రాకుండా నిరుత్సాహపరుస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణప్రాంతాలలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది’ అంటున్నారు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ.
వ్యవస్థాగత అవరోధాలను కూడా ఆమె ఎత్తి చూపారు.
‘చైల్డ్కేర్ ఫెసిలిటీస్, సేఫ్ వర్కింగ్ కండీషన్, జెండర్–సెన్సిటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత స్పష్టంగా ఉంది. మహిళలను లక్ష్యంగా చేసుకొని తగినంత రిక్రూట్మెంట్ డ్రైవ్లు లేకపోవడం, పరిమిత మార్గదర్శకత్వం, కెరీర్ పురోగతి మందగించడం వంటి ఇతర సమస్యలు దీనిని మరింత తీవ్రతరం చేస్తాయి. ఈ మౌలిక సమస్యలను పరిష్కరించకపోతే, పోలీస్ వృత్తిలోకి మహిళల ప్రవేశం పరిమితంగానే కొనసాగుతుంది’ అంటారు కిరణ్ బేడీ.
‘యూనిఫాం ధరించిన పురుష సిబ్బంది నుంచి మహిళా పోలీసులకు తగినంత సహకారం లభించడం లేదు’ అంటున్నారు కొందరు మహిళా పోలీసు అధికారులు.
నెమ్మదిగా అయినా సరే...
‘చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో మహిళలకు 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి. ఎక్కువమంది మహిళలను చేర్చుకోవడంలో వారంతా సీరియస్గా ఉన్నారు. నెమ్మదిగా మా సంఖ్య పెరుగుతోంది’ అంటారు మాజీ ఐపీఎస్ అధికారి మీరాన్ చద్దా.