నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్‌ఫుల్‌ | Java Plum Health Benefits Uses and Important Facts check here | Sakshi
Sakshi News home page

నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్‌ఫుల్‌

May 25 2024 11:31 AM | Updated on May 25 2024 12:20 PM

 Java Plum Health Benefits Uses and Important Facts check here

ప్రకృతిలో ఏ సీజన్‌లో వచ్చే పండ్లను ఆసీజన్‌లో తినడం ఆరోగ్యానికి చాలామంచింది. ప్రస్తుతం  అల్లనేరేడు పండ్ల సీజన్ వచ్చేసింది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ పండ్లు  తియ్యగా, పుల్లగా రుచికరంగా  ఉంటాయి.  ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు , కేన్సర్ , కాలేయ సంబంధ వ్యాధుల్ని నివారించే ఎన్నో ఔషధగుణాలున్నాయి.  అల్లనేరేడు పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి..  ముఖ్యంగా షుగర్‌ వ్యాధి గ్రస్తులకు చాలామంచిదని చెబుతారు.అల్ల నేరేడు పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.  అధిక మూత్ర విసర్జన, దప్పిక వంటి డయాబెటిస్ లక్షణాలను అల్ల నేరేడు పండ్లు తగ్గిస్తాయి.
 

దీన్ని శాస్త్రీయంగా సిజిజియం క్యుమిని అని పిలుస్తారు, ఇది భారత ఉపఖండానికి చెందిన ఫలాలను ఇచ్చే చెట్టు. జంబోలన్ లేదా జామున్ అని కూడా పిలుస్తారు.  సాధారణంగా మే , జూలై నెలల మధ్య వేసవి నెలలలో  పండ్లు ఎక్కువగా వస్తాయి.  నేనేడు పండు మాత్రమే కాదు,  విత్తనాలు, ఆకుల్లో కూడా ఔషధ గుణాలున్నాయి. 

పండు: పండ్ల రూపంలో తాజాగా లేదా జామ్‌లు, జ్యూస్‌లా ప్రాసెస్ చేసిన రూపాల్లో విస్తృతంగా వినియోగిస్తారు.
విత్తనాలు: గింజలు నూనెను తీయడానికి ఉపయోగిస్తారు.
ఆకులు, విత్తనాలు ఆయుర్వేద ఔషధాలు, మూలికల తయారీలలో ఉపయోగిస్తారు.

నేరేడు పండులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి  సహా అనేక పోషకాలున్నాయి. నేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్ల నేరేడు ప్రయోజనాలు

  • నేరేడు పండ్లు శరీరానికి చలువ చేస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు నేరెడు పండ్లను తింటే తక్షణం శక్తి వస్తుంది. 

  • డయాబెటిక్ రోగులు రోజూ నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేస్తుంది.

  • ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.

  • మహిళలకు రుతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయంగా చేసుకొని చెంచాడు తాగితే  మంచిది

  • నేరేడు పండు ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఫైబర్‌ ఎక్కువ.

  • నేరేడు పండ్లలోని యాంటీ అక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగు పర్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. 

  •  నేరెడు పండ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. 

  • నేరేడు పండ్లు చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది.

 

అపోహ
నేరేడు పండ్లు గర్భిణీ స్త్రీలు తినకూడదని అపోహ ప్రచారంలో ఉంది. వాస్తవానికి దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.  నేరేడు పండ్లు తింటే పుట్టబోయే పిల్లలు నల్లగా పుడతారని, వారి చర్మంపై నల్లటి చారలు ఏర్పడుతాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. నిజానికి ఈ పండ్లలో కాల్షియం, విటమిన్‌-సి, పొటాషియం, మినరల్స్‌  పుట్టబోయే శిశువు ఎముకలు పటిష్టపరచడానికి సహాయపడతాయి.

ఎవరు తినకూడదంటే...
నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. కాబట్టి ఆపరేషన్లకు ముందు, తర్వాత తినకపోవడం ఉత్తమం.
అతిగా తినడం వల్ల లోబీపీ వచ్చే అవకాశం ఉంది. 
నేరేడు పండ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలు, పచ్చళ్లు కూడా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను అస్సలు తినకూడదు. లేదంటే వికారం, వాంతులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. 

అయితే ఇవి తిన్న వెంటనే పాలు మాత్రం తాగకూడదని అంటున్నారు.  చర్మ సమస్యలు ఉన్న వారు వీటిని తినడం వల్ల అలర్జీలు ఎక్కువవుతాయని చెబుతారు.
 

Advertisement
 
Advertisement
Advertisement