
పెద్దల సూచనలు, సలహాలు స్వీకరించడం అంటే, యువతకు ఏమీ తెలియదని కాదు. మారుతున్న కాలగతిలో, సాంకేతిక పురోగతిలో తమకున్న పరిజ్ఞానానికి గురువులు అందించే సూచనలు ఆచరిస్తే, కలిగే ప్రయోజనమే వేరు. ఈ విధమైన సమన్వయం తో జీవితాన్ని నడిపే యువత అత్యంత ప్రతిభాశాలురుగా నిలవడం మనకు తెలిసిన విషయమే.
పాండవ మధ్యముడైన అర్జునుడు మిగిలినపాండవుల మాదిరిగా, కౌరవుల మాదిరిగా అందరిలాంటి యోధుడే. కానీ,పార్థునిలో ఉన్న విశేషగుణం విలువిద్యలో అతనికొక ప్రత్యేకతను సంతరించింది. చీకటిలో కూడా బాణాలు వేయగలగడం, శబ్దాన్ని అనుసరించి అస్త్రాలను సంధించడం, ఎడం చేతితోనూ బాణాన్ని అవలీలగా ఉపయోగించగలగడం వంటివి గురువు చెప్పిన సూచనలనుపాటించడం ద్వారా గొప్ప విలుకాడయ్యాడు.
ద్రోణుడు తాను అస్త్రవిద్యను నేర్చుకునే సందర్భంలో ఎదుర్కొన్న సమస్యలను అర్జునునికి తెలపడం, అర్జునుడు ఆ సమస్యలను ఎలా అధిగమించాలి అన్న విషయాన్ని గురువు చెప్పిన విధంగాపాటించడం చేశాడు. నిత్యమూ జరిగే, సాధారణమైన అస్త్ర బోధన పూర్తి చేశాక గురువు చెప్పిన విషయాలను తేలికగా తీసుకోక,అత్యంత నిజాయితీగా ఆచరణలో పెట్టి సవ్యసాచిగా నిలిచి, యువతకు నేటికీ చక్కటి ఉదాహరణగా నిలిచాడు.
పెద్దలు లేక గురువులు మనకు ఏదైనా విషయాన్ని బోధిస్తే, అది మన మంచికే అన్న సంగతిని యువత ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అనుభవంతో వారు చెప్పే మాటల్లో వెలకట్టలేని విలువైన సమాచారం దాగి ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు వాటినిపాటిస్తే జీవితంలో వచ్చే ఎన్నో సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. గురువు అంటే వయసులోనే పెద్దవాళ్ళు కాదు, ఎంతో అనుభవం తమ సొంతం చేసుకున్నవారు. ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను దాటి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు. పరిణామ క్రమంలో కాలంలో వచ్చే మార్పులో, అలవాట్ల విషయంలో గురువులకూ, శిష్యులకూ కొంత భేదం తప్పకుండా ఉంటుంది.
అంత మాత్రాన మన జీవితానికి సంబంధించి వాళ్ళు చెప్పే విషయాలనుపాత చింతకాయ పచ్చడి అన్న చందాన పరిగణించకూడదు. ఎందుకంటే, వాళ్ళు మనకు మంచిని బోధించే సమయంలో గానీ, ఏదైనా సూచనలు, సలహాలు ఇచ్చినప్పుడు గానీ, గతంలో తమకు ఎదురైన అనుభవాలను ఉదాహరణలుగా బోధించడం మనకు తెలిసిన విషయమే. యువత గమనించవలసినది ఏమిటంటే, ఒక ప్రత్యేకమైన సమస్య చదువులో కానీ, తమ జీవితానికి సంబంధించి గానీ ఎదురైనప్పుడు పెద్దవాళ్ళతో లేక గురువులతో చర్చిస్తే, దానివల్ల ఒనగూడే లాభమే వేరు. దాదాపుగా ఇటువంటి సమస్యనో, ఉత్పాతాన్నో గతంలో వాళ్ళు ఎదుర్కొనే ఉంటారు కాబట్టి, వెంటనే ఆ గడ్డు సమస్యను ఏ విధంగా అధిగమించాలో మనకు చక్కగా సూచిస్తారు.
నిత్య జీవితంలో ఎన్నో సమస్యలతో, సందేహాలతో సతమతమయ్యే నరేంద్రుడు, గురువైన రామకృష్ణులు అనుభవంతో చెప్పిన ప్రతిపాఠాన్ని అత్యంత శ్రద్ధతో విని, వారు చెప్పిన సూచనలను చక్కగా ఆచరణలో పెట్టాడు. మహితమైన తన లక్షణాలతో జాతి మొత్తం గర్వించే స్వామి వివేకానందగా అందరి మన్ననలూ నిత్యమూ అందుకుంటున్నాడు. నరేంద్రుడు తెలివైనవాడే అయినా, పెద్దరికంతో గురువుగా రామకృష్ణులు చెప్పిన మాటలను అత్యంత వినయవిధేయతలతో అనుసరించాడు కాబట్టే, భరతజాతి మొత్తానికే ఆదర్శ్రపాయుడయ్యాడు.
నేటి తరంలో ఈ పంథాలో చక్కగా చెప్పుకోగలిగే ఒక ఉదాహరణ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. సచిన్ చిన్నతనంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా, క్రికెట్ ఆటలో తనకున్న ప్రతిభకు గురువు చెప్పే సూచనలకు ఎంతో విలువిచ్చి, తన బ్యాటింగ్ టెక్నిక్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు. ఫలితంగా ప్రత్యర్థి ఎవరైనా, బౌలర్ ఎవరైనా సచిన్ నిర్భీతితో బ్యాటింగ్ చేసిన విధం విశ్వమంతా ఎరిగిన విషయమే. చివరికి తన ఆట తీరుకు, అద్భుత బాటింగ్ శైలికి సచిన్ ‘క్రికెట్ దేవుడు’ గా పేరు పొందాడు. ఈ విధంగా చెప్పుకుంటూపోతే, ఎన్నో చక్కటి ఉదాహరణలు మనకు తారసపడతాయి.
అందుకే గురువులు తమ అనుభవసారంతో చెప్పే సలహాలు, వాటిని నిజాయితీగాపాటించే యువతకు విజయహారంగా మారతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి