నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న ఇలాంటి హత్యోదంతాలు సమాజంలో భయాందోళనలు
కలిగిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఘర్షణలు చినికి చినికి గాలివానగా మారి హత్యలకు దారితీస్తున్నాయి. కలకాలం కలిసిమెలిసి బతుకుతామని ప్రమాణం చేసిన వారే, కాలం గడిచే కొద్దీ ఒకరికొకరు శత్రువులుగా మారిపోతున్నారు.
సోషల్ మీడియా ఇప్పుడు ఒక మేనియాగా మారింది. మద్యం, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల మాదిరిగా ఈ మహమ్మారి నిండుజీవితాలను కబళిస్తోంది. సామాజిక మాధ్యమ వేదికలపై ఏర్పడే పరిచయాలు, సరికొత్త ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలకు ఇవి వాహకాలుగా పనిచేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలకు అలవాటు పడిన భార్యాభర్తలు క్రమంగా భావోద్వేగాలు పంచుకోలేక క్రమంగా ఆ బంధానికి దూరమవుతున్నారు.
దీంతో ఆ స్థానంలోకి కొత్త వ్యక్తులు చేరుతున్నారని, దాంపత్య జీవితాల్లో కల్లోలం మొదలవుతుందని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సంహిత చెబుతున్నారు. ‘నేను, నా సుఖ సంతోషాలు, నా ఆనందం, నేను కోరుకున్న, నాకు ఇష్టమైన జీవితం.. అనే భావన ఒక నార్సిస్ట్ ధోరణికి దారితీస్తోంది. ఈ తరహా మానసిక ప్రవర్తన కారణంగానే కొత్త వ్యక్తులకు దగ్గరై సొంత మనుషులను దూరం చేసుకుంటున్నారని, అవసరమైతే వారిని అంతమొందించేందుకు కూడా వెనుకాడడం లేదని చెప్పారు.
అస్తిత్వ పోరాటం..
మరోవైపు ఈ ప్రవృత్తి ఉన్నవారిలో ఐడెంటిటీ క్రైసిస్ భార్యాభర్తల మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది.
ఇతరులు తమను గుర్తించాలనే సంక్షోభంలో కొట్టుకుపోతున్నారు. ‘నిరంతరం తాము ఇతరులను ఆకర్షించాలని కోరుకుంటారు. తమను చూసినప్పుడు ఎదుటివారిలో ఎగ్జైట్మెంట్ కలగాలని భావిస్తారు. సోషల్ మీడియాలోని ఫాంటసీ కంటెంట్, థ్రిల్లర్ కంటెంట్ అలాంటి భ్రమలను సృష్టిస్తాయి.
దీంతో కొత్త వ్యక్తులకు దగ్గరైన కొద్దీ సొంతవాళ్లకు దూరమవుతున్నారు.’ అని మరో మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ఒక రహస్య జీవితానికి అవకాశం కల్పిస్తోంది. ఆ రహస్య జీవితంలోపడి చాలా దూరమే కొట్టుకుపోతున్నారు. ఇది క్రమంగా హింసా ప్రవృత్తికి దారితీస్తుందని పేర్కొన్నారు.
‘రెడ్ఫ్లాగ్స్’ ధోరణి..
వివాహేతర సంబంధాలతో రహస్య జీవితానికి అలవాటుపడిన వాళ్లు కుటుంబం నుంచి విడిపోయేందుకు ‘రెడ్ఫ్లాగ్స్’ ధోరణిని అనుసరిస్తారు. అంటే తమ రహస్య జీవితంలోకి ఇతరులు ప్రవేశిస్తారేమోనన్న అభద్రతా భావంతో భార్యాభర్తలు ఒకరినొకరు దూరం పెట్టేస్తారు. చివరకు తమ వస్తువులను తాకినా, ఫోన్ ముట్టుకున్నా భరించలేరు.
ఒకరిపై మరొకరికి ద్వేషం పెరుగుతుంది. ఎలా అయినా వాళ్ల నుంచి దూరం పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలనే మానసిక నిపుణులు ‘రెడ్ఫ్లాగ్స్’గా పరిగణిస్తున్నారు. నచ్చిన చాక్లెట్ తిన్నట్లుగా, నచ్చిన సినిమా చూసినట్లుగా ‘ఐ నో వాట్ ఐ వాంట్’ అనే భ్రమలో ఎలాంటి దుస్సాహసానికైనా తెగిస్తున్నారు. కట్టుకున్నవారిని కడతేర్చడం ద్వారా ఫ్రీడమ్ లభిస్తుందనే భావనతో జీవితకాల శిక్షను అనుభవిస్తున్నారు.
పెళ్లి కాంట్రాక్ట్ కాదు..
భార్యాభర్తల బంధాల్లో మూడో వ్యక్తి ప్రమేయం ఆందోళన కలిగిస్తోంది. పెళ్లిని ఒక కాంట్రాక్ట్గా భావించే స్వభావం వల్లనే ఇలాంటి పెడధోరణులు చోటుచేసుకుంటున్నాయి. అనైతిక సంబంధాలను సమర్థించే విధంగా వస్తున్న సినిమాలు, రీల్స్, వెబ్సిరీస్లు సమాజాన్ని ప్రమాదకరంగా మారుస్తున్నాయి. జీవితం పట్ల సానుకూల దృక్పథం కొరవడుతోంది. మితిమీరిన అహం వల్ల హత్యలకు పాల్పడుతున్నారు.
– మమతా రఘువీర్, సామాజిక కార్యకర్త
సానుకూల దృక్పథం ఉండాలి..
నార్సిస్ట్ ప్రవృత్తి తొలగిపోవాలంటూ ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవనశైలిని, చక్కటి సాంస్కృతిక, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. భార్యాభర్తలుగా పాటించవలసిన ధర్మాన్ని, బాధ్యతలను గుర్తించాలి. మొదట అన్ని రకాల సామాజిక మాధ్యమాలను పక్కన పెట్టి, పెడధోరణుల నుంచి బయటపడేందుకు సొంతవాళ్లతో ఎక్కువ సమయం గడపాలి. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. కానీ అడిక్ట్ కావొద్దు.
– డాక్టర్ సంహిత, సీనియర్ సైకియాట్రిస్ట్
(చదవండి: తరచుగా కళ్లను రుద్దితో..డార్క్ సర్కిల్స్ వస్తాయా..?)


