సూర్యపుత్రిగా... యమధర్మరాజు సోదరిగా... శ్రీకృష్ణుని లీలా స్మృతిగా పూజలందుకునే యమునా నదికి అత్యంత విశిష్టమైన పుష్కరాలు మంగళవారం నాడు ఆరంభమయ్యాయి. ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు కాళీయమర్దనం చేసిన పవిత్ర నది కావడం వల్ల ఈ ఉత్సవాలకు భక్తిరసప్రాధాన్యత ఎంతో ఉంది. ఉత్తరాఖండ్లోని యమునోత్రి నుండి మొదలై మథుర (విశ్రామ్ ఘాట్), బృందావనం (కేశిఘాట్), ఆగ్రా మీదుగా ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం వరకు గల వివిధ ఘాట్లలో భక్తులు నదీ పూజలు, మహా హారతులు నిర్వహిస్తూ భక్తి సాగరంలో మునిగితేలుతారు.
యమునా నదిప్రాశస్త్యాన్ని, వైభవాన్ని స్తుతిస్తూ మన పురాణాలలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. కలిందనందిని దేవి యమరాజసహోదరి పాపం హర మే దేవి యమునే త్వాం నమామ్యహమ్ కలింద పర్వతంపై జన్మించిన ఓ యమునా దేవి! యమధర్మరాజు సోదరివైన నిన్ను నేను నమస్కరిస్తున్నాను, నా పాపాలన్నింటినీ హరించి నాకు పుణ్యగతిని ప్రసాదించు అని ఈ శ్లోకం అంతరార్థం.
గురు భగవానుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించిన శుభ ముహూర్తాన యమునా నదికి పుష్కరాలుప్రారంభమవుతాయి. మొదటి 12 రోజులు (ఆది పుష్కరాలు): జూన్ 2 నుండి జూన్ 13 వరకు పుష్కరుడు యమునా నదిలోనే నివాసం ఉంటాడు. ఈ సమయంలో నదిలోని ప్రతి నీటి బొట్టు అత్యంత శక్తిమంతంగా, పవిత్రంగా మారుతుందని నమ్ముతారు.
కృష్ణప్రియ
యమునా నది కేవలం ఒక జలవనరు మాత్రమే కాదు, ఆమె ఒక దైవిక శక్తి. పురాణాల ప్రకారం ఈ నదికి మూడు ముఖ్యమైన కోణాలు ఉన్నాయి: సూర్య పుత్రి (సూర్యుని కుమార్తె): సూర్యుని తేజస్సును కలిగి ఉండటం వల్ల, ఈ నదిలో స్నానం చేయడం వల్ల శరీరంలోని జడత్వం, అనారోగ్యాలు తొలగి΄ోయి తేజస్సు పెరుగుతుంది.
మృత్యుదేవత అయిన యముడు తన సోదరి అయిన యమునా నదికి ఇచ్చిన వరం మేరకు ఎవరైతే యమునా నదిలో భక్తితో స్నానం చేస్తారో, వారికి అకాల మృత్యు భయం ఉండవు, వారు నరక బాధల నుండి విముక్తులవుతారు. అదేవిధంగా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు తన బాల్యాన్ని యమునా నదీ తీరంలోనే గడిపాడు. కాళీయమర్దనం, గోపికల వస్త్రాపహరణం, రాసలీలలు అన్నీ ఈ నది సాక్షిగానే జరిగాయి. అందువల్ల యమునా స్నానం భక్తి యోగాన్ని ఇస్తుంది.
12 రోజుల పుష్కర విధులు– ఏ రోజు ఏ దానం చేయాలి?
పుష్కరాల సమయంలో స్నానంతో పాటు ‘దానం’ చేయడం అత్యంత ముఖ్యం. ఏ రోజు ఏ దానం చేయాలో శాస్త్రం ఇలా నిర్దేశించింది:
1వ రోజు: భూదానం, హిరణ్య (బంగారు) దానం, ధాన్యదానం
2వ రోజు: వస్త్ర దానం, రత్న దానం.
3వ రోజు: అశ్వ (గుర్రం లేదా వాహన) దానం, పండ్ల దానం
4వ రోజు: నెయ్యి, నూనె, పాలు మరియు తేనె దానం.
5వ రోజు: ఎద్దు దానం, ధాన్యాలు, నాగలి దానం (వ్యవసాయ వస్తువులు).
6వ రోజు: ఔషధాలు, కర్పూరం, చందనం, సుగంధ ద్రవ్యాల దానం.
7వ రోజు: గృహోపకరణాలు, మంచం, పరుపు దానం.
8వ రోజు: కట్టెలు (సమిధలు), మూలికల దానం
9వ రోజు: పిండప్రదానం, దాస–దాసీ దానం (సేవకులకు సహాయం).
10వ రోజు: కూరగాయలు, ఆకుకూరలు, సాలగ్రామ దానం.
11వ రోజు: పుస్తకాలు, చదువుకు సంబంధించిన వస్తువుల దానం.
12వ రోజు: వెండి వస్తువులు, ఛత్రం (గొడుగు) పాదరక్షల దానం.
ఎలా వెళ్లాలంటే..?
తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లే భక్తులు సాధారణంగా 2 రకాల రూట్లను ఎంచుకుంటారు: రూట్ 1 (రైలు మార్గం – మథుర/బృందావనం): సికింద్రాబాద్ లేదా విజయవాడ నుండి దిల్లీ వెళ్లే ఏ రైలైనా (ఉదాహరణకు: ఏపీ ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్, రాజధాని) మథుర జంక్షన్ మీదుగా వెళ్తుంది. హైదరాబాద్ నుండి మథురకు దాదాపు 22 నుండి 24 గంటల సమయం పడుతుంది.
విమాన మార్గం: హైదరాబాద్ నుండి దిల్లీకి విమానంలో వెళ్లి, అక్కడ నుండి క్యాబ్ లేదా యమునా ఎక్స్ప్రెస్వే ద్వారా 3 గంటల్లో మథురకు చేరుకోవచ్చు.
ప్రధాన ఘాట్ల భౌగోళిక, ఆధ్యాత్మిక విశేషాలు
యమునాపుష్కర స్నాన యాత్ర ప్రణాళిక వేసుకునేటప్పుడు ఈ కింది ఘాట్ల ప్రత్యేకతలను గుర్తుంచుకోవాలి.
మథుర – విశ్రామ్ ఘాట్: కంసుడిని వధించిన తర్వాత శ్రీకృష్ణుడు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడని ప్రతీతి. పుష్కరాల సమయంలో ఇక్కడ సాయంత్రం జరిగే యమునా హారతి అత్యంత నయనానందకరంగా ఉంటుంది.
బృందావనం – కేశి ఘాట్: కేశి అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించిన ప్రదేశం. ఇక్కడ స్నానం చేయడం వల్ల భయాలు తొలగి΄ోతాయి.
ప్రయాగ్రాజ్ – త్రివేణి సంగమం: ఇక్కడ యమునా నది ముదురు నీలం (శ్యామల) రంగులో, గంగానది తెల్లటి రంగులో కలిసి΄ోవడం స్పష్టంగా కనిపిస్తుంది. యమునా పుష్కరాల వేళ ఈ సంగమ స్నానానికి కోటి రెట్లు ఫలితం ఉంటుంది.
యమునోత్రి (కఠినమైన యాత్ర): ఇది హిమాలయాలలో 3,293 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ ‘సూర్య కుండ్’ అనే వేడి నీటి బుగ్గ ఉంటుంది. ఇక్కడికి వెళ్లడం శారీరకంగా కష్టంతో కూడుకున్నది కాబట్టి వృద్ధులు మథుర లేదా ప్రయాగ్రాజ్లను ఎంచుకోవడం మంచిది. – డి.వి.ఆర్.


