● నిలిచిన రావులపర్రు వంతెన నిర్మాణం
● బిల్లులు అవ్వక పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్
● వంతెన కోసం ప్రజల ఎదురుచూపులు
ఉంగుటూరు: పత్తేపురం పంటకాలువపై వంతెన నిర్మాణం మళ్లీ నిలిచిపోయింది. బిల్లులు పూర్తికాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేసినట్లు తెలిసింది. ఈ వంతెన నిర్మాణం కోసం రావులపర్రు గ్రామ ప్రజలు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2019కి ముందు పత్తేపురం పంటకాలువపై ఉన్న వంతెన శిథిలమై కూలిన నాటి నుంచి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయ ఉత్పుత్తులు, ఎరువులు పురుగుమందులు గ్రామంలోకి తేవాలన్నా, గ్రామం నుంచి బయటకు తోలాలన్నా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ప్రజలు మండల కేంద్రం ఉంగుటూరు చేరాలంటే చుట్టూ తిరిగి నారాయణఫురం మీద నుంచి రావాల్సి వస్తోంది. దీంతో కూలిన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు గ్రామ ప్రజలు విజ్ఞప్తులు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు మారినా పని పూర్తి కాలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు వంతెన నిర్మాణానికి రూ.70 లక్షలు నిధులు మంజూరు చేయించడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఆర్అండ్బీ శాఖ వారి పర్యవేక్షణలో ఈ వంతెన పనులు పూర్తి కావాల్సి ఉంది. గతేడాది కొంతవరకు పనులు చేశారు. పక్క గోడలు కూడా పూర్తయ్యాయి. అయితే ఆ తరువాత నుంచి పనులు నిలిచిపోయాయి. చేసిన పని వరకు బిల్లు అవ్వకపోవడం వల్ల కాంట్రాక్టరు పని ఆపేసినట్లు తెల్సింది.


