ఏలూరు టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ (జేపీ) మర్యాదపూర్వకంగా కలిశారు. ఏలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, పార్టీ కమిటీల నియామకం, డిజిటలైజేషన్ వంటి అంశాలపై అధినేత వైఎస్ జగన్ పార్టీ సమన్వయకర్త జేపీని ఆరా తీశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు మరింత ఉత్సాహంగా, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారని జేపీ తెలిపారు.
ఏలూరు (టూటౌన్): పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం సుధీర్ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు డీఆర్ఓ వి విశ్వేశ్వరరావుకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని, మెరుగైన పీఆర్సీ, ఐఆర్ ఇస్తామని నమ్మబలికి ఇప్పటికీ ప్రకటించకపోవడం దారుణమన్నారు. నాలుగు డీఏలను పెండింగ్ పెట్టడం, పీఆర్సీ కమిటీని వేయకపోవడం, ఉద్యోగ ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయటం బాధాకరం అన్నారు.
ఏలూరు (టూటౌన్): భారత్ అలీన విధానానికి కట్టుబడి ఉండాలని, యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలని, పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం, కే.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఏలూరు సీపీఎం విస్తృత స్థాయి సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఇరాన్పై దాడితో ఇండియా పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉందన్నారు. మోదీ ఇరాన్ తరఫున కాకుండా.. అమెరికా వ్యూహంలో భాగస్వామి అయ్యారని, ఇజ్రాయెల్ తరఫున స్పందించి దేశ ప్రతిష్టను దిగజార్చారని తెలిపారు. వంట గ్యాస్ సిలిండర్ రూ.60, వాణిజ్య సిలిండర్ రూ.115 పెంచడాన్ని ఖండించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి ఏ.రవి, కార్యదర్శి వర్గ సభ్యులు డీఎన్వీడీ ప్రసాద్, ఆర్. లింగరాజు తదితరులు పాల్గొన్నారు.
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎస్ ఎంఆర్ఎస్ బృందం సభ్యులు మంగళవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరు, మట్టి, రాయి నాణ్యతను పరిశీలించారు. సీఎస్ ఎంఆర్ఎస్ న్యూఢిల్లీ నుంచి వచ్చిన బృందం డైరెక్టర్ చిత్ర, జాయింట్ డైరెక్టర్ మనీష్ గుప్త, పీపీఏ జలవనరుల శాఖ వాప్కోస్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పనులను నాణ్యతను పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కంట్రోలింగ్ విభాగం ఇంజనీరింగ్ అధికారులకు మెటీరియల్ నాణ్యత, కొలతలు, సాంకేతిక విషయాలపై అవగాహన కల్పించారు. జరుగుతున్న ప్రతి పనిపై మట్టి, రాయి నాణ్యతను పరిశీలించి, స్థానిక ల్యాబ్లో కొన్ని పరీక్షలు జరిపారు. మరికొంత మెటీరియల్ను ఢిల్లీలో పరీక్షలు నిర్వహించేందుకు తీసుకువెళుతున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు పేర్కొన్నారు.


