తాడేపల్లిగూడెం అర్బన్: లంచం తీసుకుంటూ తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ సర్వేయర్ ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ ప్రాంతానికి చెందిన కొమ్ముల రాధకు తాడేపల్లిగూడెం కడకట్ల ప్రాంతంలో స్థల ఉంది. ఆ స్థలం రీ సర్వే చేయించుకొని మ్యుటేషన్ సర్టిఫికెట్ కోసం మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంపై కొమ్ముల రాధ కుటుంబ స్నేహితులు, తాడేపల్లిగూడెంకు చెందిన సింగిరి ఎడ్వెర్డ్ కెనడి మున్సిపల్ అధికారులను కలిశారు. ఆ స్థలంలో పోరంబోకు భూమి కలిసి ఉందని దానిని సరిచేసి మ్యుటేషన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు మున్సిపల్ సర్వేయర్ రౌతు రామకృష్ణ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సింగిరి అడ్వర్డ్ కెనడి స్థలం యజమాని కొమ్ముల రాధకు తెలియజేయడంతో ఆమె విజయవాడ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. అక్కడ అధికారుల ఆదేశాలతో జిల్లా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. కెనడీ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటున్న సర్వేయర్ రామకృష్ణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు, సీఐలు ఎం బాలకృష్ణ, కె శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.


