ద్వారకాతిరుమల : ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలను విస్తృత పరిచేందుకు కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కరూర్ వైశ్యా బ్యాంక్ సహకారంతో ప్రభుత్వం 100 కియోస్క్లను భక్తులకు అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలోని పలు విభాగాల్లో ఏర్పాటు చేసిన ఈ కియోస్క్ యంత్రాలు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటి ద్వారా డిజిటల్ చెల్లింపులు జరిపి సులువుగా దర్శనం, సేవ, ప్రసాదం, కేశఖండన, ఇ–హుండీ, వసతి టికెట్లతో పాటు, ఆలయ సమాచారాన్ని భక్తులు పొందొచ్చని ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. అదేవిధంగా గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే అవసరం ఉండదన్నారు. ప్రస్తుతం ఈ కియోస్క్ యంత్రాలను కొండ కింద సమాచార కేంద్రం, కేశ ఖండనశాల, శ్రీ ధర్మ అప్పరాయ నిలయం, ప్రసాదాల కౌంటర్ల సముదాయం, అనివేటి మండపం, పీఆర్వో కార్యాలయం, నిత్య కల్యాణమండపం వద్ద వీటిని ఏర్పాటు చేశారు.
భీమవరం: మద్యం మత్తులో భవనంపైనుంచి దూకుతానంటూ యువకుడు హల్చల్ చేశాడు. వివరాల ప్రకారం ఒడిస్సాకు చెందిన కపిలేంద్రనాయక్ శుక్రవారం తల్లి, సోదరితో కలసి రైలులో విజయవాడ బయలుదేరాడు. రాత్రి సమయంలో రైలు భీమవరం వచ్చేసరికి తల్లి, సోదరిని వదిలి దిగిపోయాడు. రాత్రి అంతా స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గడిపిన కపిలేంద్రనాయక్ శనివారం ఉదయం పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డులోని ఒక భవనంపైకి ఎక్కి దూకుతానంటూ బెదిరించాడు. దీంతో స్థాని కులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతనికి నచ్చచెప్పి కిందికి దించారు. కపిలేంద్రనాయక్ అతిగా మద్యం సేవించడమేగాక ఖైనీ వంటివి తినడంతో పాటు మతిస్థిమితం లేకపోవడంతో ఈ విధంగా ప్రవర్తించాడని చెబుతున్నారు.
నూజివీడు: మండలంలోని రామన్నగూడెం సమీపంలోని పెట్రోలు బంకు వద్ద శనివారం బైక్లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం పట్టణంలోని బంగినపల్లితోట ప్రాంతానికి చెందిన ఖండవల్లి భానుబాబు(37), దాసరి సత్తిబాబు(50) కలిసి ఉదయం 11.30 గంటల సమయంలో నూజివీడు నుంచి రామన్నగూడెం వెళ్తున్నారు. పెట్రోలు బంకు సమీపంలోకి వెళ్లేసరికి ఎదురుగా వట్టిగుడిపాడుకు చెందిన నాగేశ్వరరావురావు నూజివీడు వెళ్తుండగా రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఖండవల్లి భానుబాబు మృతిచెందగా దాసరి సత్తిబాబు, నాగేశ్వరరావులకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని, క్షతగాత్రులను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్సై ఎన్.లక్ష్మణ్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


