ద్వారకాతిరుమల: శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ రెండో శనివారం కావడంతో చిన్నతిరుపతి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్ధం ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. ముఖ్యంగా దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. 140 జంటలు శ్రీవారి నిత్యార్జిత కల్యాణంలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు స్వామి వారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే అనివేటి మండపంలో పలు భజన మండళ్ల సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి.
జంగారెడ్డిగూడెం: మనస్థాపానికి గురై కలుపు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హెచ్సీ ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపారు. వివరాల ప్రకారం మండలంలోని కేతవరం గ్రామానికి చెందిన కారిశెట్టి వెంకటరెడ్డి (54) వ్యవసాయ కూలీ. ఆరు నెలల క్రితం వెంకటరెడ్డి తన కుమారుడితో కలిసి మోటార్సైకిల్పై వెళుతుండగా, ఇద్దరూ రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు. గాయాల కారణంగా నడవలేని స్థితిలో అప్పటి నుంచి వెంకటరెడ్డి ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన వెంకటరెడ్డి శనివారం ఉదయం పొలానికి వెళ్లి కలుపు మందు తాగాడు. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే వెంకటరెడ్డిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై మృతుని భార్య సుబ్బలక్ష్మి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు. వెంకటరెడ్డికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.


