పెద్దింట్లమ్మ జాతరకు భక్తుల తాకిడి
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరలో ఆదివారం భక్తులు కిటకిటలాడారు. సమీప జిల్లాల నుంచి వేలాది మంది మొక్కులు సమర్పించుకున్నారు. పెద్దింట్లమ్మకు విశేషార్చన, నూతన వస్త్ర అలంకరణ, పుష్పాలంకరణ, పంచమావరణ కలశార్చన, ద్రవ్యోపచారాలతో అర్చన, ధూపసేవ, బాలభోగం, నీరాజన మంత్ర పుష్పార్చన జరిగింది. అమ్మవార్లకు వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాద వితరణ దాతగా విజయవాడకు చెందిన కొయ వేంకటేశ్వరరావు దంపతులు వ్యవహరించారు. జాతరకు వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదం, మజ్జిగను ఆలయ ధర్మకర్త కొల్లి రాంబాబు అందించారు. భక్తులకు వాటర్ ప్యాకెట్లను విజయవాడకు చెందిన బండారు కృష్ణ ప్రసాద్ పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వాహనాలతో వచ్చిన భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు వంటలు చేసుకోడానికి దేవస్థానం ఉచిత పందిర్లను కేటాయించింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కూరెళ్ల లక్ష్మీజ్యోతి బృందం ప్రదర్శించిన కూచిపూడి భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఈ నెల 28న జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వస్వామి కల్యాణం జరుగుతుందన్నారు. అమ్మవారికి రూ.2,29,565 ఆదాయం వచ్చిందని ఈవో శ్రీనివాసు చెప్పారు.
28న జలదుర్గా గోకర్ణేశ్వర కల్యాణం
పెద్దింట్లమ్మ జాతరకు భక్తుల తాకిడి


