పాతాళానికి రూప్చంద్ ధర
● ఏడాదిలో కిలో రూ.125 నుంచి రూ.82కు పడిపోయిన ధర
● మేతల ధర పెంపుతో తీవ్ర ప్రభావం
గణపవరం: రూప్చంద్ చేపల సాగు చేపట్టిన ఆక్వా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏడాది క్రితం వరకూ ధర బాగానే.. ప్రస్తుతం ధర పాతాళానికి పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పది నెలల్లో కిలోకు ఏకంగా రూ.40 వరకూ ధర తగ్గింది. దీంతో రూప్చంద్ సాగుచేసే రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది
గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితి
గతేడాది జనవరిలో రూప్చంద్ కిలో ధర రూ.125 వరకు పలికింది. రొయ్యల సాగులో తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులు రూప్చంద్ సాగు చేపట్టారు. మంచి ధర ఉండడంతో రైతులు ఆనందపడ్డారు. అయితే క్రమంగా ధర తగ్గిపోవడంతో రైతు ఢీలపడ్డాడు. గత జూలై వరకు రూ.112 – రూ.115 వరకూ పలికిన ధర, క్రమంగా తగ్గుముఖం పడుతూ ప్రస్తుతం రూ.82కి చేరింది. గత మూడు, నాలుగు నెలలుగా రూ.80 నుంచి రూ.85 మధ్యే ఉంది. దీంతో రైతులు చేపలను అమ్ముకోలేక, చెరువుల్లో ఉంచి మేపలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో ఆక్వాసాగు మొదలైన తర్వాత ఇంతటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ చూడలేదని రైతులంటున్నారు. సరిగా పట్టుబడి సమయానికి ధర తగ్గిపోవడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండేళ్ల క్రితం కూడా రూప్చంద్ ధర కిలో రూ.60కు పడిపోయి రైతులు దారుణంగా నష్టపోయారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 2.35 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా.. అందులో 1.5 లక్షల ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. ఇందులో అధిక శాతం అంటే 70 నుంచి 80 వేల ఎకరాల్లో రూప్చంద్ సాగు చేస్తున్నారు. ప్రస్తుత ధర కిలో రూ.85 చొప్పున అమ్మితే వచ్చే సొమ్ము కేవలం మేతలు, మందులకే సరిపోతుంది. చెరువు లీజులు, సీడ్, విద్యుత్ బిల్లులు, కాపలాదారుల జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులు చూసుకుంటే ఎకరాకు కనీసం లక్ష రూపాయల నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు మేత కంపెనీలు కిలోకు రూ.4 చొప్పున ధరలు పెంచడంతో మరింత నష్టం తప్పడం లేదు. కొంతకాలం వేచిచూస్తే చేప ధర పెరుగుతుందన్న ఆశతో రోజుల తరబడి చేపలను చెరువులో ఉంచి మేపడం వల్ల మరింత నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు


