బలవంతపు భూసేకరణకు వ్యతిరేకం
ఏలూరు (టూటౌన్): నేవీ ఆయుధ డిపోకు వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణకు మాత్రమే తాము వ్యతిరేకమని, ఆ ప్రాంత ప్రజల పోరాటానికి మద్దతు తెలుపుతున్నామని అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. ఆదివారం స్థానిక పవర్పేటలోని సీపీఎం కార్యాలయంలో కొయ్యలగూడెం మండలం నేవీ ఆయుధ డిపో భూ సేకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించా రు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అధ్యక్షత వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల అనుమతితోనే ఆయుధ డిపో ఏర్పాటుచేయాలని, బలవంతపు భూసేకరణను తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, మంగపతిదేవిపేట పరిసర గ్రా మాల ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చా రు. పోరాటాలు చేస్తున్న ప్రజలపై, వారికి అండగా ఉంటున్న రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నా యకులపై తప్పుడు కేసులు బనాయించడం సరికాదన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని లేకుంటే ప్రజాపోరాటంలో తా ము పాల్గొంటామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ ఆందోళనలకు సీపీఎం సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు ఎస్.రాజశేఖర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామసభలు నిర్వహించి ప్రజల ఆమోదంతోనే భూసేకరణ చేయాలన్నారు. వైఎస్సార్సీపీ ఏలూరు ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, ఏలూరు ఏఎంసీ మాజీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, సీపీఎం నగర కార్యదర్శి పంపన రవికుమార్, కొయ్యలగూడెం మండల కన్వీనర్ శుక్లబోయిన రాంబాబు, మంగపతిదేవిపేట సర్పంచ్ ఎ.సుబ్రహ్మణ్యం, బాధిత గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.


