అక్రమ కలప స్వాధీనం
కొయ్యలగూడెం: అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నట్లు కన్నాపురం ఫారెస్ట్ రేంజర్ భాను ప్రకాష్ శనివారం తెలిపారు. రాజవరం సమీపంలో రహస్య ప్రదేశంలో అక్రమ కలపను నిల్వ ఉంచారన్న సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. రూ. లక్ష విలువైన 20 టేకు దిమ్మలు రేంజ్ కార్యాలయానికి తరలించామన్నారు.
పోలవరం రూరల్: పట్టిసం శివక్షేత్రం రేవులో నిత్యం తిరుగుతున్న ఫెర్రీ లాంచీ నిబంధనలకు విరుద్ధగా తిరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాయంత్రం 6 గంటలకే బోట్లు నిలిపివేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఏడు గంటల వరకు యథేచ్ఛగా తిరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీనిపై శనివారం సాయంత్రం రేవులో విలేకరులు లాంచీ ఆలస్యంగా తిరగడంపై ప్రశ్నించగా, స్థానిక కూటమి భాగస్వామ్యంలోని పార్టీ నాయకులు దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది.
దెందులూరు: దెందులూరు నియోజకవర్గ సీహెచ్సీలో గత కొంతకాలం నుంచి ఎక్స్రే కంప్యూటర్ పనిచేయడం లేదు. ప్రజలు ఎక్స్రే తీయించుకోవడానికి వచ్చి వెళ్ళిపోతున్నారు. ఎక్స్రే సౌకర్యం లేదని సాక్షిలో కథనం ప్రచురితమైంది. సీహెచ్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీహరి, సీఎస్సీ సూపరింటెండెంట్ డాక్టర్ సుందర్ బాబు జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు. ఎక్స్రే కంప్యూటర్ యథావిధిగా సేవలందించేలా చర్యలు తీసుకున్నారు.
బుట్టాయగూడెం: మండలంలోని నందాపురం సమీపంలో శనివారం రాత్రి కారు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నందాపురానికి చెందిన పవెల సుబ్బారావు(55) రోడ్డు పక్కన నిలుచుని ఉండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ సంఘటనలో సుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందాడు. సుబ్బారావు మృతితో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రాకపోకలు నిలిపివేశారు. ఎస్సై దుర్గామహేశ్వరరావు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.


