ఆలోచనలకు పదునుపెట్టిన వెబినార్
కై కలూరు: దృశ్య మాధ్యమ విధానంలో స్థానిక వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కేంద్రంగా గురువారం ప్రారంభమైన అంతర్జాతీయ వెబినార్ శుక్రవారంతో ముగిసింది. మొదటి రోజు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంశంపై వెబినార్ జరిగింది. కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కూనా రాంజీ ప్రసంగించారు. శుక్రవారం మొదటి విభాగంలో డబ్లిన్ యూనివర్సిటీ, ఐర్లాండ్కు చెందిన డాక్టర్ అరుణ్ మణికందన్ ప్రొటెక్టింగ్ గ్రీన్ ఇన్నోవేషన్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ బయో ప్రాసెసింగ్ అండ్ బయో రిఫైనింగ్ అంశంపై విపులంగా ప్రసంగించారు. అనంతరం కృష్ణా యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పీవీ.బ్రహ్మచారి కార్పొరేట్ మోనోపోలీ అండ్ డిప్లిటింగ్ రిసోర్సెస్ అంశంపై చక్కగా వివరించారు. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంగళగిరి ఉన్నత విద్య జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సీ.కృష్ణ రోల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంశంపై కూలంకషంగా ప్రసంగించారు. చివరిరోజు ప్రిన్సిపాల్ డాక్టర్ వై.శ్రీలత అధ్యక్షత వహించగా, రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ డైరెక్టర్, డాక్టర్ పీవీ.కృష్ణాజీ, వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
పెంటపాడు: కొండేపాడు గ్రామంలో శుక్రవారం వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఎస్సై కె.స్వామి వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బిట్రా పోశిరత్నం (21) శుక్రవారం ఉదయం కొండేపాడులోని ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెందింది. విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు పెంటపాడు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి పెదనాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోశిరత్నం ప్రస్తుతం 4 నెలల గర్భిణీ అని సమాచారం.


