ఉన్నత విద్యకు సెట్ చేసుకుందాం
● ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులు చేసే వారు ఏపీ ఈఏపీ సెట్కు దరఖాస్తు చేసుకోవాలి.
● బీఈడీ, స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు చేసే వారు ఏపీ ఎడ్సెట్కు
● ఇతర కోర్సులు చదివి ఇంజనీరింగ్, బీ.టెక్, బీ.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈసెట్కు దరఖాస్తు చేసుకోవాలి.
● ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చేయడానికి ఏపీ ఐసెట్కు దరఖాస్తు చేసుకోవాలి.
● ఎం.టెక్, ఎం.ఫార్మసీ, ఫార్మా డీ కోర్సులు చేయడానికి ఏపీ పీజీఈ సెట్కు
● బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు ఏపీ పీఈ సెట్కు దరఖాస్తు చేసుకోవాలి.
● ఎంఏ, ఎం కామ్, ఎంఎస్సీ, ఎంసీజే, ఎం.లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ తదితర పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులకు ఏపీ పీజీ సెట్కు
● న్యాయవిద్య చదవడానికి లా సెట్కు దరఖాస్తు చేసుకోవాలి.
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉన్నత విద్య చదవాలనుకునే వారు వివిధ కోర్సుల్లో చేరడానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సమయం దగ్గరపడింది. ఇంటర్ అనంతరం ఇంజినీరింగ్, బీ.ఫార్మసీ, అగ్రికల్చరల్, ఎంబీఏ, ఎంసీఏ, న్యాయ విద్య, డిగ్రీ తరువాత పీజీ, ఎం.టెక్, ఎం.ఫార్మసీ వంటి కోర్సులు చేయాలన్నా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు రాయాల్సిందే. ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాకుండానే వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది.
షెడ్యూల్ విడుదల
ఉన్నత విద్యా మండలి ఆయా కోర్సులకు ఏ సెట్ ఎప్పుడు జరుగుతుందో, ఏ సెట్కు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి, ఎంత ఫీజు చెల్లించాలి అన్న విషయాలతో ఈ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో విద్యార్థుల్లో సందడి ప్రారంభమైంది. తాము చేయాలనుకునే కోర్సులకు సంబంధించిన సెట్కు ఇప్పటి నుంచే దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కొంతమంది విద్యార్థులు ఆన్లైన్లో ఉన్నత విద్యా మండలి సూచించిన వెబ్సైట్లలో నేరుగా దరఖాస్తు చేసుకుంటుండగా మరికొందరు విద్యార్థులకు ప్రస్తుతం చదువుతున్న విద్యాసంస్థల యాజమాన్యాలే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ఏర్పాట్లు చేశాయి. పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ఆన్లైన్లో అవకాశం కల్పించింది. ఏపీ ఈఏపీ సెట్కు అపరాధ రుసుం లేకుండా వచ్చే మార్చి 7 వరకూ అవకాశం ఉంది. ఏపీ ఎడ్ సెట్కు మార్చి 9 వరకూ, ఈ సెట్, ఐసెట్కు మార్చి 2 వరకూ, పీజీఈ సెట్కు మార్చి 6 వరకూ, ఏపీ పీ సెట్కు ఏప్రిల్ 30 వరకూ, ఏపీ పీజీ సెట్కు మార్చి 9 వరకూ, ఏపీ లా సెట్కు మార్చి 12 వరకూ అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఏప్రిల్, మే నెలల్లో షెడ్యూల్ విడుదల
దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్షలు ఎప్పుడు నిర్వహించే విషయంపై ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన షెడ్యూల్లో వివరించింది. ఏపీ ఈఏపీ సెట్ మే 12 నుంచి 20 వరకూ జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఏపీ ఎడ్సెట్ మే 4న చిత్తూరు ద్రవిడియన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో, ఈసెట్ ఏప్రిల్ 23న జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో, ఐసెట్ మే 2న ఆంధ్రా యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఏపీ పీజీఈ సెట్ ఏప్రిల్ 28 నుంచి 30 వరకూ ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో, ఏపీ పీ సెట్ జూన్ 3 నుంచి 8 వరకూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో, ఏపీ పీజీ సెట్ మే 5 నుంచి 11 వరకూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆధ్వర్యంలో, ఏపీ లా సెట్ మే 4న తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన ప్రవేశ పరీక్షల
సందడి
నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి
ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలకు షెడ్యూల్ విడుదల


