నల్ల బ్యాడ్జీలతో వీఆర్ఓల నిరసన
దెందులూరు: దెందులూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఓల అసోసియేషన్ దెందులూరు మండల అధ్యక్షులు కిషోర్ ఆధ్వర్యంలో బుధవారం వీఆర్ఓలు నిరసన వ్యక్తం చేశారు. శాఖపరమైన సమస్యలు పరిష్కారం కోసం ముందుగా ఇచ్చిన నోటీసు ప్రకారం నల్లబ్యాడ్జీలతో నిరసనతో ప్రారంభించామన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పెడచెవిని పెట్టిందని పట్టించుకోవట్లేదని, పని ఒత్తిడి ఎక్కువైందని అన్నారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో అర్హులైన పేదల పిల్లలకు ఉచిత విద్య అవకాశం కల్పించడానికి నిర్దేశించిన చట్టం ప్రకారం 25 శాతం సీట్లకు 1వ తరగతిలో ప్రవేశాల కోసం అర్హులైన తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవచ్చని సమగ్రశిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే.పంకజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లోని 25 శాతం సీట్లలో ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4, బీసీలకు 6 శాతం, ఇతరులకు 5 శాతం సీట్లు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి మార్చి 10 వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
పెదపాడు: రోడ్డు ప్రమా దంలో ఓ మహిళ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ గుణదలకు చెందిన పోలవరపు వెంకట శివరామకృష్ణ తన కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ నుంచి ఉదయం 5.30 గంటల సమయంలో ద్వారకాతిరుమలకు కారులో బయలు దేరారు. మధ్యలో పెదపాడు మండలంలోని తాళ్లమూడి వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. దీంతో శివరామకృష్ణ కుమార్తెకు మరో ఇద్దరు బంధువులు కొత్తూరు శోభన్బాబు, పొట్లూరి సుజాతకు గాయాలయ్యాయి. వీరిని హనుమాన్జంక్షన్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కీర్తి (27) తలకు బలమైన గాయాలవడంతో మృతిచెందింది. శోభన్బాబు, సుజాతను మెరుగైన వైద్యపరీక్షల కోసం విజయవాడ తరలించారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని ఆగడాలలంక సీబీసీఎన్సీ ప్రాథమిక పాఠశాల, బుసరాజుపల్లి పీఎంకే ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ పోస్టుల భర్తీ నిమిత్తం జిల్లా విద్యాశాఖ నిర్వహించనున్న పరీక్షలకు తమ పాఠశాలలకు ఎలాంటి సంబంధం లేదని ఆ పాఠశాలల కరస్పాండెంట్లు కాకర్ల శివప్రసాద్, పీ. జీవన్ కుమార్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానం జారీచేసిన మధ్యంతత ఆదేశాల్లో తమ పాఠశాలల్లో నియామకాలు సంబంధించిన పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారానే నిర్వహించాలని స్పష్టంగా పేర్కొందన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి విద్యాశాఖ పరీక్షలు నిర్వహించడంపై కోర్టు ధిక్కరణ కేసును దాఖలు చేశామన్నారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ థియరీ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే.యోహాన్ సూచించారు. థియరీ పరీక్షల నిర్వహణపై స్థానిక సీఆర్ఆర్ కళాశాలలో బుధవారం పరీక్షల కోసం ఏర్పాటు చేసిన 56 పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, కస్టోడియన్, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా 56 పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్మీడియట్ విద్యామండలి సెక్రటరీ రంజిత్ బాషా జూమ్ ద్వారా మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరపాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు రాసేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
నల్ల బ్యాడ్జీలతో వీఆర్ఓల నిరసన
నల్ల బ్యాడ్జీలతో వీఆర్ఓల నిరసన


