నేటి నుంచి తపస్సు కాల దీక్షలు
● సుమారు లక్ష మందికిపైగా దీక్షల స్వీకరణ
● 40 రోజులపాటు విశ్వాసుల దీక్షలు
దెందులూరు: ప్రభువు ఏసుక్రీస్తు ఎడారికి వెళ్లి 40 రోజుల పడిన శ్రమలను అనుసరించి క్రైస్తవులు అనునిత్యం ప్రార్థిస్తూ, ఉపవాసం చేస్తూ తపస్సుకాల దీక్షలు చేస్తారు. నేటి నుంచి ఈ దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని క్రైస్తవ సంఘాలతో కలిపి లక్ష మందికిపైగా ఈ తపస్సు కాల దీక్షలు స్వీకరించనున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తపస్సు కాల దీక్షలను ఫాదర్ ఐ.మైఖేల్ ప్రారంభించారు. 1992వ సంవత్సరంలో భీమవరం ఆర్సీఎం విచారణ వేంపాడులో అప్పట్లో ఆర్సీఎం ఏలూరు పీఠాధిపతి జాన్ ములగాడ ప్రొత్సాహం, సహాయ సహకారాలతో ఆరుగురితో తపస్సు కాల దీక్షలను ప్రారంభించారు. జాన్ ములగాడ ప్రస్తుత ఏలూరు పీఠాధిపతి డాక్టర్ పొలిమేర జయరావు సహాయ సహకారాలతో అన్ని క్రైస్తవ సంఘాలతో కలిపి ప్రస్తుతం లక్షకుపైగా తపస్సు కాలదీక్షలు చేపడతున్నారు.
దీక్షలు ఇలా..
● ఉదయం, సాయంత్రం దేవాలయాలకు వెళ్లి ప్రార్థనలు చేయాలి.
● తెలుపు, ముక్కుపొడి రంగు దుస్తులు ధరించాలి.
● కాళ్లకు చెప్పులు వేయకూడదు. నేలపై చాప మీద నిద్రించాలి.
● మాంసాహారం, వివాహ జీవితానికి, మద్యానికి దూరంగా ఉండాలి.
● ప్రతి బుధ, శుక్రవారాల్లో శిలువు మార్గంలో పాల్గొనాలి. వారంలో ఒకరోజు దీక్షలు చేపట్టిన వారి సమూహం వద్ద రాత్రి ప్రార్థన నిర్వహించాలి.
● దీక్షా కాలంలో ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలి.
● దేవాలయం వద్దే దీక్షను విరమింపచేయాలి.


