శుభకార్యం ఇంట మృత్యు ఘంటికలు
● విద్యుత్ షాక్ తగిలి బాలుడి మృతి
● శోకసంద్రంలో బంధుగణం
జంగారెడ్డిగూడెం: కొద్ది గంటల్లో శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట మృత్యుఘంటికలు మోగాయి. పుష్పాలంకరణ వేడుక సందడిలో ఉన్న బంధుగణం అంతా విద్యుత్ షాక్ తగిలి బాలుడు మృతి చెందిన ఘటన చూసి హతాశులయ్యారు. జంగారెడ్డిగూడెం మండలం వెంకటరామానుజపురంలో విద్యుత్ షాక్ తగిలి 11 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. బాలుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటరామానుజపురం గ్రామానికి చెందిన నూనె చంద్రం, లలిత దంపతుల కుమారుడు నూనె వెంకట సుశాంత్ (11) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. సోమవారం నూనె చంద్రం బావమరిది నులకాని మధు కుమార్తె పుష్పాలంకరణ వేడుక జరగనుంది. వీరిద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండడంతో మధ్యు ఇంటి శుభకార్యం హడావుడిలో బంధువులు, కుటుంబసభ్యులు ఉన్నారు. అక్కడే వంటలు చేసేందుకు వినియోగించే గ్రైండర్ను విద్యుత్ బోర్డుకు తగిలించి స్విచ్ ఆన్ చేసి వదిలివేశారు. అటు ఇటు తిరుగుతున్న సుశాంత్ గ్రైండర్ వైర్ కట్ అయి ఉన్న చోట కాలు వేయడంతో విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే బాలుడు ఒక చేతితో గ్రైండర్ను, మరో చేతితో ఐరన్ బల్లను పట్టుకుని అక్కడికక్కడే కూర్చిండిపోయాడు. కొద్దిసేపటికి బాలుడి అమ్మమ్మ నరాల సీతమ్మ వచ్చి అలా ఎంత సేపు కుర్చొంటావు అంటూ సుశాంత్ను పట్టుకోబోయింది. ఆమెకు విద్యుత్ షాక్ తగలడంతో వెంటనే వదిలించుకుని, బందువులను పిలిచింది. వారు విద్యుత్ బోర్డు స్విచ్ ఆఫ్ చేసి బాలుడిని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడి మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్గం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. బాలుడు తండ్రి చంద్రం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. కాగా, వేడుక జరగాల్సిన ఇంట బాలుడు మరణ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మధు ఇంట్లో జరగాల్సిన పుష్పాలంకరణ వేడుక నిలిచిపోయింది.
కై కలూరు: వరకట్న వేధింపులపై కై కలూరు రూరల్ పోలీసు స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. కై కలూరు మండలం పెంచికలమర్రుకు చెందిన ప్రశాంతికి ఏలూరు జిల్లా గుడివాకలంకకు చెందిన బలే రామారావుతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇరువురు సంతానం. కొద్ది రోజులుగా అధికకట్నం తీసుకురావాలని వేధిస్తుడటంతో భర్త, అతని కుటుంబ సభ్యులపై ప్రశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూరల్ ఎస్సై వి.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


